రేపే కొమురవెల్లి మల్లన్న పెద్ద పట్నం
● మహా శివరాత్రి వేడుకలకుసర్వం సిద్ధం
● తరలిరానున్న భక్తజనం
కొమురవెల్లి(సిద్దిపేట): ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం మహాశివరాత్రి వేడుకలకు సంసిద్ధమైంది. పరమశివుడి ప్రతిరూపంగా, భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న కొమురవెల్లి మల్లన్నను దర్శించుకుని భక్తులు భారీ సంఖ్యలో తరలిరానున్నారు. శివరాత్రిని పురస్కరించుకుని స్వామి వారికి నిరంతర అభిషేకాలు చేయనున్నారు. యాదవ సంప్రదాయం ప్రకారం తోటబావి ప్రాంగణంలో ఆదివారం పెద్దపట్నం వేసి స్వామి వారికి కల్యాణం నిర్వహించనున్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని నిర్వహించే పెద్దపట్నానికి వైవిధ్యం, విశిష్టత ఉంది. పసుపు, కుంకుమ, తెల్లపిండి, సునేరు,పచ్చలను ప్రథమ గణాలుగా సమ్మేళనం చేసి చిత్రకన్ను నెలకొల్పి 41 వరుసలతో పట్నాన్ని వేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతారు. అనంతరం ఉత్సవ విగ్రహాలతో పట్నం చుట్టూ ప్రదక్షిణలు చేసి తొక్కుతూ స్వామి వారిని దర్శించుకుంటారు. పట్నాన్ని తిలకించి చిందేస్తే తమ కష్టాలు కడతేరుతాయని భక్తుల నమ్మకం.


