సర్వే అధికారుల పాత్ర కీలకం
● పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలి
● అధికారులకు కలెక్టర్ హైమావతి ఆదేశం
సిద్దిపేటరూరల్: భూ భారతి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంలో సర్వే అధికారుల పాత్ర కీలకమని కలెక్టర్ కె.హైమావతి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో జిల్లా, మండల సర్వే ల్యాండ్ శాఖకు సంబంధించిన కార్యకలాపాలపై కలెక్టర్, అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఎఫ్లైన్ పిటిషన్, అప్పీలు, ప్రజావాణి దరఖాస్తుల పరిష్కార ప్రక్రియపై ఆరా తీసారు. పెండింగ్లో దరఖాస్తులు పరిశీలించి, వెంటనే పరిష్కరించాలన్నారు. కొత్తగా ఎంపికై న లైసెన్స్ సర్వేయర్లను ఫీల్డ్ విజిట్ చేయించి, సర్వే అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు.
మిల్లర్లకు ఇబ్బందులు ఉంటే చెప్పాలి
జిల్లాలో రైతులతో పాటు మిల్లర్లకు ఇబ్బందులు తలెత్తకుండా సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్ కె. హైమావతి మిల్లర్లకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో 2025–26 కాటన్ మార్కెట్ ఎంఎస్పీ కింద పత్తి సేకరణకు సంబంధించి మిల్లర్లు, అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. మిల్లర్లు ఎల్1, ఎల్2, ఎల్3, ఎల్ 4 ఎంపిక విధానం వల్ల జిల్లా పరిధిలో మొత్తం 22 జిన్నింగ్ మిల్లులకు 10 మిల్లుల్లో కొనుగోలు ప్రక్రియ ప్రారంభం కాలేదన్నారు. రైతులు పండించిన పంటను పాత జిల్లాల పరిధిలో యాప్ ద్వారా రైతులే మిల్లులను ఎంచుకుంటారన్నారు. మిల్లుల సామర్థ్యాన్ని మించి పంట నిల్వలు ఉన్నట్లయితే, మరో మిల్లుకు తరలించుకునే అవకాశం రైతులకు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, డీఎం మార్కెటింగ్ నాగరాజు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శంకర్ నారాయణ, మిల్లర్లు పాల్గొన్నారు.
హుస్నాబాద్: పంచాయతీ రాజ్ శాఖలో ఈజీఎస్ కింద చేపడుతున్న గ్రామ పంచాయతీ భవనాలను డిసెంబర్ లోపు పూర్తి చేయాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. పట్టణ మున్సిపల్ కౌన్సిల్ కార్యాలయంలో హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులపై కలెక్టర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోహెడ నుంచి సముద్రాల రోడ్డు బీటీ రోడ్డు, హుస్నాబాద్లో జంక్షన్, ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. ఆర్డీఓ రామ్మూర్తి, డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, అధికారులు పాల్గొన్నారు.


