
పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం
సీడీపీఓ శారద
చిన్నకోడూరు(సిద్దిపేట): గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం తీసుకుంటేనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని సీడీపీఓ శారద అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో శనివారం పోషణ పక్షం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అప్పుడే పుట్టిన శిశువుకు ముర్రుపాలు పట్టడంతోపాటు ఆరు నెలల వరకు తల్లిపాలు తాగించాలన్నారు. గర్భిణులు తప్పనిసరిగా అంగన్వాడీ కేంద్రంలోనే ఒక పూట భోజనం తినాలని, పిల్లలకు బాలామృతం తినిపించాలని సూచించారు. పోషకాహారం, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించి, సామూహిక సీమంతాలు చేశారు. ఎంపీడీఓ జనార్దన్, సూపర్ వైజర్ భాగ్యలక్ష్మి, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు..
హుస్నాబాద్రూరల్: గర్భిణులు పోషకాహారం తీసు కుంటేనే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని ఐసీడీఎస్ అధికారి తిరుమల అన్నారు. పందిల్లలో నిర్వహించిన పోషక పక్షోత్సవాల కార్యక్రమంలో ఆమె పాల్గొని పోషకాలు కలిగిన ఆహారం గురించి అవగాహన కల్పించారు. పౌష్టికాహారం తీసుకొంటే పిల్లల ఎదుగలలో లోపాలు ఉండవని, అంగన్వాడీ కేంద్రాల్లో పంపిణీ చేసే ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పారు. అనంతరం సామూహిక సీమంతాలు చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యా యుడు అశోక్, అంగన్వాడీ టీచర్లు శారద తదితరులు పాల్గొన్నారు.
పౌష్టికాహారంతోనే ఎదుగుదల
బెజ్జంకి(సిద్దిపేట): పౌష్టికాహారాన్ని అందించినపుడే పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారని హుస్నాబాద్ సీడీపీఓ జయమ్మ అన్నారు. మండలంలోని బేగంపేటలోని అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేశారు. సూపర్వైజర్ నాగరాజు, తోటపెల్లి వైద్యాధికారి కృష్ణతేజ, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
ముండ్రాయి సెక్టార్లో..
నంగునూరు(సిద్దిపేట): గర్భిణులు వైద్యులు సూచించిన వాక్సిన్లు తీసుకుంటే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని సీడీపీఓ శారద సూచించారు. ముండ్రాయి సెక్టార్లో సామూహిక సీమంతాలు, చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించారు. చిరుధాన్యాలు, ఆకుకూరలతో వండిన పదార్థాలను ప్రదర్శించి వాటి లాభాలను వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సరిత, సూపర్ వైజర్ స్వరూప, హెచ్ఓ స్వామి, అనురాధ, సౌమ్య, రజిత, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం