
ఎండు గంజాయి స్వాధీనం
● నలుగురు రిమాండ్
మునిపల్లి(అందోల్): అక్రమంగా తరలిస్తున్న ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు బుదేరా ఎస్ఐ రాజేశ్ నాయక్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. మండలంలోని కంకోల్ టోల్ ప్లాజా సమీపంలో గురువారం వాహనాలను తనిఖీ చేస్తున్నాం. బీదర్ నుంచి హైద్రాబాద్కు వెళ్తున్న కారులో 130 గ్రాముల ఎండు గంజాయి లభించింది. కారులో ఉన్న వత్సల్ రామ్శెట్టి, ఆకాశ్, అజయ్ దేశ్ముఖ, సోహెల్ను అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. గంజాయి చాకచక్యంగా పట్టుకున్న ఎస్ఐ రాజేశ్నాయక్, పోలీస్ సిబ్బందిని కొండాపూర్ సీఐ వెంకటేశం అభినందించారు. అలాగే కంకోల్ టోల్ ప్లాజా సమీపంలో వాహనాల తనిఖీ చేస్తుండగా రెండు బైక్లపై రియాజ్ పాషా, రేహాన్, సోఫి యాన్, ఆసిఫ్ 110 గ్రాముల ఎండు గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించాం. రియాజ్ పాషా, రేహాన్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించగా మరో ఇద్దరు పరారైనట్లు తెలిపారు.
కంది శివారులో ఐదు కిలోలు
కంది(సంగారెడ్డి): అక్రమంగా తరలిస్తున్న ఎండు గంజాయిని రూరల్ పోలీసులు పట్టుకున్నారు. రూరల్ ఎస్ఐ రవీందర్ కథనం మేరకు.. మండల కేంద్రమైన కంది శివారులో సాయంత్రం వాహనాలను తనిఖీ చేస్తున్న క్రమంలో ఓ కారులో 5 కిలోల ఎండు గంజాయి దొరికింది. కాశీపురం ఆంజనేయులుగా గుర్తించి కారుతోపాటు గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐపేర్కొన్నారు.
విషపు ఆహారం తిని..
● మూడు ఆవులు మృతి
హత్నూర (సంగారెడ్డి): విష ఆహారం తిని మూడు పాడి ఆవులు మృతి చెందిన ఘటన హత్నూర మండలం గుండ్ల మాచునూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన మన్నె సత్తయ్య పాడి గేదెలు, ఆవులను మేపుతూ జీవిస్తున్నాడు. గ్రామ శివారులో గల చెరువు సమీపంలో ఇటీవల సినీ ఇండస్ట్రీ వాళ్లు సినిమా షూటింగ్లో భాగంగా అమ్మవారికి అన్నం రతి పోసి నైవేద్యం సమర్పించే సన్నివేశాన్ని చిత్రీకరించారు. సుమారు 3 క్వింటాళ్ల బియ్యంతో వండిన అన్నం వదిలేసి వెళ్లిపోయారు. వారం రోజుల కిందట వండిన అన్నం కావడంతో పూర్తిగా కుళ్లిపోయింది. ఆ ఆహారాన్ని బుధవారం సాయంత్రం మూడు ఆవులు తిని మృతి చెందాయి. సుమారు రూ.3 లక్షల వరకు నష్టపోయినట్లు బాధితుడు సత్తయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
మాకు మున్సిపాలిటీ వద్దు
జిన్నారం(పటాన్చెరు): జిన్నారంను మున్సిపాలిటీ చేయొద్దని డిమాండ్ చేస్తూ జిన్నారం బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు జగన్రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం మందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...జిన్నారంను మున్సిపల్ చేయడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని తెలిపారు. రైతులు నష్టపోతారని వివరించారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు నర్సింగరావు, ప్రతాపరెడ్డి, రాజిరెడ్డి, రమేశ్,అశోక్ తదితరులు పాల్గొన్నారు.
శబ్ద గ్రంథాలయాలు
దివ్యాంగులకు ఉపయోగం
కలెక్టర్ వల్లూరు క్రాంతి
సంగారెడ్డి జోన్: శబ్ద గ్రంథాలయాల్లో ఆడియో పుస్తకాలు దివ్యాంగులకు ఎంతో ఉపయోగమని కలెక్టర్ వల్లూరు క్రాంతి పేర్కొన్నారు. గురువారం జిల్లా గ్రంథాలయ సంస్థ ఆవరణలో కంటిచూపు లేని దివ్యాంగుల కోసం మహిళా శిశు వికలాంగులు, వయోవృద్ధులు,ట్రాన్స్జెండర్స్ శాఖ ఆధ్వర్యంలో సౌండ్ లైబ్రరీ ఏర్పాటు పనులకు కలెక్టర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...దివ్యాంగులు కూడా మిగతా వారితో సమానంగా విద్యను సమాచారాన్ని పొందడానికి హక్కు కలిగి ఉన్నారన్నారు. ఈ లైబ్రరీ ద్వారా చదువును వినిపించి, దివ్యాంగులకు విజ్ఞానాన్ని చేరవేసే అవకాశం లభించనుందన్నారు. ఈ ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి, డిప్యూటీ ఇంజనీర్ దీపక్, డీసీపీఓ రత్నం, వికలాంగులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ సీనియర్ అసిస్టెంట్ వెంకటేశం, ఫీల్డ్ రెస్పాన్స్ అధికారి సతీశ్ తదితరులు పాల్గొన్నారు.

ఎండు గంజాయి స్వాధీనం

ఎండు గంజాయి స్వాధీనం

ఎండు గంజాయి స్వాధీనం