సరికొత్తగా విత్తనోత్పత్తి | - | Sakshi
Sakshi News home page

సరికొత్తగా విత్తనోత్పత్తి

Apr 14 2025 7:18 AM | Updated on Apr 14 2025 7:18 AM

సరికొ

సరికొత్తగా విత్తనోత్పత్తి

నాణ్యమైన విత్తనాలు రైతులకు అందించడమే లక్ష్యంగా.. విత్తనోత్పత్తి పథకాన్ని సరికొత్తగా చేపట్టడానికి రంగం సిద్ధమైంది. గతంలో చేపట్టిన పథకం ద్వారా ఆశించిన ఫలితాలు రాకపోగా, పథకం నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ఈసారి పకడ్బందీగా చేపట్టడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ప్రొఫెసర్‌ జయశంకర్‌ ఆగ్రికల్చర్‌ యూనివర్సిటీ పర్యవేక్షణలో ప్రతి గ్రామంలో ముగ్గురు లేదా ఆపైన అభ్యుదయ రైతులను ఎంపిక చేసి విత్తనోత్పత్తి చేపట్టనున్నారు. వచ్చే జూన్‌లో ఈ పథకం అమలుచేయడానికి వ్యవసాయశాఖ కార్యాచరణ సిద్ధం చేసింది.

వివరాలు పంపించాం

కొత్తగా చేపట్టబోతున్న విత్తనోత్పత్తి పథకానికి సంబంధించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామాలు, రైతుల వివరాలు పంపించాం. పూర్తి సమాచారంతో కూడిన మార్గదర్శకాలు ఇంకా విడుదల కావాల్సి ఉన్నది. వస్తే దాని ప్రకారం ముందుకు సాగుతాం.

– రాధిక, జిల్లా వ్యవసాయాధికారి

గజ్వేల్‌: వ్యవసాయశాఖ లెక్కల ప్రకారం జిల్లాలో వానా కాలానికి సంబంధించి 5.50లక్షల ఎకరాల్లో పంటలు సాగులోకి వస్తుంటాయి. ఇందులో వరి, పత్తి, మొక్కజొన్న, పత్తి, కంది పంటలే కీలకం. అదేవిధంగా యాసంగికి సంబంధించి 4లక్షల ఎకరాల మేర పంటలు సాగవుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతులందరికీ నాణ్యమైన విత్తనం అందించడం ప్రభుత్వానికి కష్టతరంగా మారుతోంది. ఈ దుస్థితిని నివారించి రైతుల్లో స్వయం ప్రతిపత్తిని పెంపొందించడానికి గతంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో గ్రామ విత్తనోత్పత్తి పథకం(సీడ్‌ విలేజ్‌) అమలు చేసిన సంగతి తెల్సిందే. వరి, మొక్కజొన్న, కంది, శనగ పంటల్లో ఈ పథకాన్ని అమలు చేశారు. దీని ద్వారా రైతులకు ఫౌండేషన్‌ సీడ్‌ (మూల విత్తనం) 50శాతం సబ్సిడీపై అందించేవారు. ఉత్పత్తిగా వచ్చిన విత్తనాలను రైతులే స్వయంగా తెలిసిన రైతులకు అమ్ముకోవాలి. కానీ దీని ద్వారా ఆశించిన ఫలితాలు రాలేదు. ఫలితంగా పథకం అమలు నిలిచిపోయింది.

నాణ్యమైన విత్తనం అందించడమే లక్ష్యంగా..

ఈసారి పకడ్బందీగా పథకం అమలు చేయడానికి వ్యవసాయశాఖ కార్యాచరణ రూపొందించింది. ప్రొఫెసర్‌ జయశంకర్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రైతులకు మూల విత్తనం(ఫౌండేషన్‌ సీడ్‌) అందించి విత్తనోత్పత్తి చేపట్టనున్నది. ప్రతి గ్రామంలో ముగ్గురికిపైగా రైతులను ఎంపిక చేయనున్నారు. ఎంపిక చేసిన రైతు సుమారు ఎకరా విస్తీర్ణంలో విత్తనోత్పత్తి చేపడతారు. వ్యవసాయశాఖ, అగ్రికల్చర్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమాన్ని నిరంతరం పర్యవేక్షిస్తారు. రైతులకు నాణ్యమైన మూల విత్తనం అందించడమేకాకుండా, ఎరువులు, క్రిమిసంహారకాలపై సబ్సిడీపై అందించే అవకాశముంది. దీంతోపాటు రైతులు ఉత్పత్తి చేసే విత్తనాలను రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ కొనుగోలు చేసేలా ఒప్పందం జరగనుంది. రైతులకు లాభం చేకూరేలా ఈ ఒప్పందం ఉండబోతున్నదని తెలుస్తోంది. ఈ విధంగా నాణ్యమైన విత్తనాలను రాష్ట్రంలో పంపిణీ చేయనున్నారు. దీనిద్వారా ప్రైవేటు రంగంలో జోరుగా సాగుతున్న విత్తనోత్పత్తికి పోటీగా నిలవాలని భావిస్తున్నారు. మరో ముఖ్యవిషయమేమీటంటే విత్తనోత్పత్తి చేపడుతున్న రైతుల వ్యవసాయ క్షేత్రాల్లో వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు విత్తనం వేసింది మొదలు.. ఉత్పత్తులు చేతికందేవరకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందించి నాణ్యమైన విత్తనోత్పత్తికి బాటలు వేయనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి స్పష్టతతో కూడా మార్గదర్శకాలు విడుదల కోసం వ్యవసాయశాఖ ఎదురుచూస్తోంది.

ప్రతి గ్రామంలో అభ్యుదయ రైతుల ఎంపిక

వరి, కంది, పెసర తదితర రకాల ఉత్పత్తి

ప్రొఫెసర్‌ జయశంకర్‌

అగ్రికల్చర్‌ యూనివర్సిటీ పర్యవేక్షణ

వచ్చే జూన్‌లో అమలుకు అవకాశం

సరికొత్తగా విత్తనోత్పత్తి1
1/1

సరికొత్తగా విత్తనోత్పత్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement