రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత
కోహెడరూరల్(హుస్నాబాద్): ప్రతి వ్యక్తి రాజ్యాంగ పరిరక్షణకు ముందుకు రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జై బాపు, జైభీమ్, జై సంవిధాన్ పాదయాత్రలో భాగంగా శుక్రవారం మండలంలోని చెంచెల్ చెర్వుపల్లిలో ఆయన కాంగ్రెస్ నాయకులతో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎంతో శ్రమించి రాసిన రాజ్యాంగం పట్ల కేంద్రం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. పాదయాత్రలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని వివరిస్తూ మందుకు సాగాలని కార్యకర్తలకు సూచించారు.


