తెలంగాణ భవన్కు అమీన్పూర్ బాధితులు
పటాన్చెరు: సాధారణ పేద, మధ్యతరగతి కుటుంబాల భూములను రకరకాల నిబంధనల పేరుతో గద్దల్లా తన్నుకుపోయేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని బాధితులు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన 22ఏ నిషేధిత భూముల అంశంపై అమీన్పూర్ మున్సిపాలిటీకి చెందిన వందలాది మంది బాధితులు మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం తెలంగాణ భవన్కు తరలివెళ్లారు. అమీన్పూర్లో విలేకరులతో మాట్లాడుతూ.. దశాబ్దాలుగా నివాసముంటున్న ఇళ్లు, ప్లాట్లు రాత్రికి రాత్రే 22ఏ నిషిద్ధ జాబితాలోకి చేరడంతో తీవ్రంగా నష్టపోయామని, పైసా పైసా కూడబెట్టి కొనుగోలు చేసిన స్థలాలు, కట్టుకున్న ఇళ్లు ఇప్పుడు దేనికీ పనికిరాకుండా పోయాయని బాధితులు వాపోయారు. పరిపాలనాపరమైన తప్పులు ప్రభుత్వం చేస్తూ, రాజకీయ ప్రయోజనాల కోసం భూములను నిషేధిత జాబితాలో చేర్చి, చివరికి ఆ నిందను అధికారులపై తోసేసేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నిస్తోందని మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి విమర్శించారు. బాధిత ప్రజలకు తెలంగాణ భవన్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, 22ఏ పేరుతో పేదల పొట్టకొట్టే కాంగ్రెస్ నిర్ణయాలపై అసెంబ్లీలోనూ, క్షేత్రస్థాయిలోనూ పోరాటం చేస్తామని బీఆర్ఎస్ నాయకత్వం స్పష్టం చేసిందని తెలిపారు.


