హత్నూర (సంగారెడ్డి): లారీలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యంను పౌరసరఫరాల శాఖ అధికారులు పట్టుకున్నారు. వివరాలు ఇలా.. మంగళవారం మండలంలోని దౌల్తాబాద్ చౌరస్తా వద్ద డీటీసీఎస్ అధికారి అనుదీప్ దేవానంద్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో బియ్యం లోడ్తో వెళుతున్న లారీని గుర్తించి ఆపారు. లారీలో దొడ్డు రకం రేషన్ బియ్యం రూ.5లక్షల 24వేల 700 విలువగల 291 క్వింటాళ్ల 50 కిలోల బియ్యాన్ని కర్ణాటక రాష్ట్రం నుంచి మహారాష్ట్రకు తరలిస్తుండగా పట్టుకున్నారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన కె.వి.ఆర్ ట్రేడింగ్ కంపెనీ బియ్యం యజమాని వెంకి రాథోడ్, మహారాష్ట్రకు చెందిన లారీ డ్రైవర్ రాజారాంపై అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టుబడిన రేషన్ బియ్యాన్ని సదాశివపేట గోదాంకు తరలించారు.
సిద్దిపేటలో 113 క్వింటాళ్లు..
సిద్దిపేటకమాన్: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది. సిద్దిపేట వన్టౌన్ సీఐ మహేందర్రెడ్డి వివరాల ప్రకారం.. పట్టణంలో అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. డీసీఎంలో 245 బస్తాల్లో మొత్తం 113.70 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించి, వాహనం, పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. డీసీఎం డ్రైవర్ కాళ్లకుంట్ల కాలనీకి చెందిన దండ్ల యాదగిరి, మరో నలుగురు వ్యక్తులకు కూడా సంబంధం ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.


