ఎంఈఎస్ఐసీ పోర్టల్ ప్రారంభించిన మంత్రి వివేక్
తూప్రాన్: రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువత భవితకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ పేర్కొన్నారు. మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి పర్యటనలో భాగంగా శాంతాబయోటిక్స్ పరిశ్రమలో జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ ప్రత్యేక చొరవతో, సీనియర్ అధికారులు, పారిశ్రామికవేత్తలు, విద్యార్థుల సమక్షంలో మెదక్ ఎంప్లాయ్మెంట్, స్కిల్స్ – ఇండస్ట్రీ కనెక్ట్ (ఎంఈఎస్ఐసీ) పోర్టల్ను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. మెదక్ జిల్లాలో (ఎంఈఎస్ఐసీ) పోర్టల్ను విద్యార్థులు, ఉద్యోగార్థులు, నైపుణ్య సంస్థలు, స్థానిక పరిశ్రమలను ధ్రువీకరించబడిన వ్యవస్థకు అనుసంధానించడానికి జిల్లా స్థాయిలో అభివృద్ధి చేయబడిన ఒక డిజిటల్ వేదిక అని తెలిపారు. జిల్లాలోని నిరుద్యోగ యువత వారి నైపుణ్యాలకు అనుగుణంగా ఈ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకుని ఉపాధి అవకాశాలు పొందవచ్చని కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో బావయ్య, ఐలా చైర్మన్ సుబ్బారావు, ఐటీసీ ఆనంద్, ఈడియం సందీప్, సర్పంచ్లు పాల్గొన్నారు. –అలాగే మనోహరాబాద్ మండలంలో రూ.3.25 కోట్లతో నూతనంగా నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) భవనాన్ని ఎంపీ రఘునందన్ రావు, కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు.
కస్తూర్బాలో మెరుగైన బోధన
చేగుంట(తూప్రాన్): విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలని జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ అన్నారు. మండలంలోని రెడ్డిపల్లికాలనీలో రూ.2.23 కోట్లతో నిర్మించిన కస్తూర్బా బాలికల పాఠశాల అదనపు భవన సముదాయాన్ని మంత్రి , ఎంపీ రఘునందన్రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, కలెక్టర్ ప్రతిమా సింగ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భవిష్యత్తులో విదేశీ భాషలు నేర్చుకుంటే విద్యార్థులకు స్వయంగా ఇతర దేశాల్లో ఉద్యోగాలు ఇప్పించనున్నట్లు హామీ ఇచ్చారు. ఉద్యోగాలతో పాటు మహిళలు 33 శాతం రిజర్వేషన్ను వినియోగించుకొని రాజకీయాల్లో రాణించాలని ఎంపీ రఘునందన్రావు కోరారు. కార్యక్రమంలో డీఈఓ, స్పెషల్ ఆఫీసర్ హేమభార్గవి, రాజు, ఎంఈఓ నీరజ, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి శ్రీనివాస్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంగళ్రావు, ప్రిన్సిపాల్ శ్రీవాణి పాల్గొన్నారు.


