పటాన్చెరు టౌన్: బయటకు వెళ్లిన వృద్ధురాలు అదృశ్యమైంది. ఈ సంఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని చిట్కుల్కు చెందిన గౌరమ్మ (70) శనివారం ఇంట్లో వారికి చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు తెలిసిన వారి వద్ద, స్థానికంగా వెతికినా ఆచూకీ లభించలేదు. తల్లి అదృశ్యంపై కూతురు లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
పనికి వెళ్లిన వ్యక్తి..
పనికి వెళ్తున్నానని చెప్పిన వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.... ఇస్నాపూర్ మున్సిపల్ పరిధికి చెందిన సురేంద్ర ప్రసాద్ (33) మే 22న కూలి పని కోసం వెళ్తున్నానని ఇంటి నుంచి వెళ్లి ఇప్పటి వరకు తిరిగి రాలేదు. అయితే గతంలో కూడా ఇలాగే ఇంటి నుంచి వెళ్లి కొద్ది రోజుల తర్వాత తిరిగి వచ్చాడు. రోజులు గడిచినా కుమారుడు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తెలిసిన వారి వద్ద, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో తండ్రి నిరంజన్ ప్రసాద్ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
వర్గల్ మండలంలో మహిళ..
వర్గల్(గజ్వేల్): మహిళ అదృశ్యమైంది. ఈ ఘటన మండలంలోని అంబర్పేటలో చోటు చేసుకుంది. గౌరారం ఏఎస్ఐ పోచగౌడ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన అల్లపురం రామయ్యకు భార్య బుచ్చమ్మ(55), ఇద్దరు కుమారులున్నారు. ఈ నెల 9న ఇంట్లో గొడవ జరగగా ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదు. పలుచోట్ల వెతికినప్పటికీ ఆచూకీ దొరకలేదు. దీంతో భర్త రామయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఏఎస్ఐ తెలిపారు.


