వైరస్ల ఆట కట్టిద్దాం!
వన్హెల్త్ పైలట్ ప్రాజెక్టుకుసంగారెడ్డి ఎంపిక జంతువుల నుంచి సంక్రమించేవ్యాధులపై అధ్యయనం జిల్లాల్లో పర్యటించిన ఎన్సీడీసీ బృందం
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: రేబిస్, బర్డ్ఫ్లూ, కేఎఫ్బీ, బ్రూఫెల్లోసిల్, ఆంత్రాక్స్..ఇలా కుక్కలు, కోళ్లు, జంతువులు, వన్యప్రాణుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులపై అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వన్హెల్త్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. దీనికి పైలట్ ప్రాజెక్టుగా తమిళనాడుతోపాటు, తెలంగాణలో సంగారెడ్డి, నాగర్కర్నూల్ జిల్లాలను ఎంపిక చేశారు. నేషనల్ సెంటర్ ఫర్ డీసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ), యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం(యూఎన్డీపీ) సంయుక్తంగా ఈ ప్రాజెక్టును అమలు చేస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా జంతువులు, పక్షులు, వన్యప్రాణుల నుంచి మానవులకు వచ్చే వ్యాధులు విస్తరించకుండా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలనే అంశంపై అధ్యయనం చేస్తున్నారు. ఇందులోభాగంగా ఎన్సీడీసీ బృందం సంగారెడ్డి జిల్లాలో వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలు, వైద్యారోగ్య, వెటర్నరీ శాఖల కార్యాలయాలను సందర్శించింది. ఆ శాఖలు నిర్వహిస్తున్న ఆన్లైన్ పోర్టల్లను పరిశీలించింది.
ఒకే గొడుగు కిందికి కీలక సమాచారం
కుక్కకాటు, బర్డ్ఫ్లూ..వంటి వ్యాధులకు సంబంధించిన కేసుల సమాచారం ఒక్కో శాఖ వద్ద ఉంటుంది. కీలకమైన ఈ సమాచారాన్ని అంతా ఒకే గొడుగు కిందికి తెచ్చేందుకు ప్రత్యేక పోర్టల్ను ఏర్పాటు చేశారు. ఈ పోర్టల్లో సంబంధిత శాఖల సమాచారాన్ని పొందుపరుస్తారు. తద్వారా కరోనా లాంటి ఏదైనా ఆపత్కాలం ఎదురైతే అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టడం వీలవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. వైద్య ఆరోగ్యశాఖతోపాటు, వెటర్నరీ, మున్సిపల్, పంచాయతీరాజ్, అగ్రికల్చర్, ఫారెస్టు, పోలీసు వంటి శాఖల సమాచారాన్ని అంతా ఈ పోర్టల్లో పొందుపరిచేలా చర్యలు తీసుకుంటారు.
కమ్యూనిటీ సిబ్బందికి శిక్షణ..
ఈ పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఆశావర్కర్లు, క్షేత్రస్థాయిలో పనిచేసే వైద్యారోగ్యశాఖకు చెందిన సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు ఇలా ప్రజలతో నేరుగా సంబంధం ఉంటే ఉద్యోగులకు శిక్షణ ఇవ్వనున్నారు.
కరోనాలాంటి ఆపత్కాలం ఎదురైతే..
కోవిడ్ వంటి ఆపత్కాల సమయంలో ఫ్రంట్ వారియర్స్గా పేర్కొనే వైద్య ఆరోగ్యశాఖతోపాటు, పారిశుద్ధ్యం విషయంలో మున్సిపల్, పంచాయతీరాజ్, పోలీసు తదితర శాఖలను సమన్వయం చేయడం ప్రారంభంలో కొంత అవాంతరాలు ఎదురయ్యాయి. కరోనా మాదిరిగా జంతువుల నుంచి సోకే వ్యాధులు ఒక్కసారిగా కమ్మేస్తే అలాంటి మహమ్మారిలను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై ఈ ప్రాజెక్టు అధ్యయనం చేస్తుందని వైద్యారోగ్యశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
వైరస్ల ఆట కట్టిద్దాం!


