చదువుతోపాటు క్రీడలూ ముఖ్యమే
● శారీరక, మానసిక ఉల్లాసానికి దోహదం ● గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు గుర్తింపు ● సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి
సిద్దిపేటజోన్: విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలూ ముఖ్యమేనని, క్రీడలు శారీరక, మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి అన్నారు. గురువారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో సీఎం కప్ జిల్లా స్థాయి పోటీలను క్రీడాజ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత క్రీడాకారులను గుర్తించి అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేలా చేయడమే సీఎం కప్ ఉద్దేశ్యమన్నారు. వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పోటీలను నిర్వహించడం జరుగుతోందన్నారు. ప్రాథమిక స్థాయిలో విద్యార్థులను క్రమశిక్షణ కలిగిన పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత వ్యాయమ ఉపాధ్యాయులపై ఉందన్నారు. విద్యార్థులు తప్పనిసరి ఎదో ఒక క్రీడల్లో పాల్గొనాలని సూచించారు. సిద్దిపేట జిల్లా క్రీడల్లో ముందు వరుసలో ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ప్రదర్శన చూపాలన్నారు. వచ్చే ఏడాది వ్యాయమ విద్యకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అంతకుముందు జిల్లా క్రీడల శాఖ అధికారి వెంకట్ నర్సయ్య మాట్లాడారు. జిల్లాలో 17వేల మంది క్రీడాకారులు పాల్గొనేలా టార్చ్ ర్యాలీ జనవరిలో నిర్వహించి రిజిస్ట్రేషన్ చేసినట్టు పేర్కొన్నారు. అంతకుముందు కలెక్టర్ హైమావతి శాంతి కపోతాలు ఎగురవేసి, జెండా ఆవిష్కరించారు. అనంతరం వివిధ క్రీడ అంశాల్లో పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పి సీఈఓ రమేష్, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ రవి నాయక్, వ్యాయమ ఉపాద్యాయులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.


