హంగ్.. ఎవరు కింగ్..?
రసకందాయంలో రాజకీయం
ఏడు మున్సిపాలిటీల్లో మ్యాజిక్ ఫిగర్కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ఎత్తుకు పైఎత్తులు స్వతంత్రులు, బీజేపీ, ఎంఐఎంకౌన్సిలర్ల మద్దతు కోసం ప్రయత్నాలు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : ఈ ఎన్నికల్లో హంగ్ ఫలితాలు వచ్చిన ఏడు బల్దియాల్లో రాజకీయం రంజుగా మారింది. ఆయా మున్సిపాలిటీలను దక్కించుకునేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ చేసే ప్రయత్నాలతో ఆ బల్దియాల్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి.
● నర్సాపూర్లో 15 స్థానాల్లో ఐదు స్థానాలను సాధించిన బీఆర్ఎస్ మ్యాజిక్ కోసం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. స్థానిక ఎమ్మెల్యే సునీతారెడ్డి ఎక్స్అఫీషియో ఓటుతోపాటు, ఆ పార్టీ ఎమ్మెల్సీల ఎక్స్అఫీషియో ఓట్లతో ఈ చైర్మన్ పీఠాన్ని సాధించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. నాలుగు సీట్లున్న బీజేపీ కీలకంగా మారింది. ఆరు స్థానాలు కాంగ్రెస్ గెలిచినప్పటికీ, ఎక్స్ అఫీషియో సభ్యుల బలం లేక పోవడం కాంగ్రెస్కు మైనస్గా మారింది.
● మెదక్లో 32 స్థానాలకు బీఆర్ఎస్ 15 గెలుచుకోగా..14 స్థానాలను కాంగ్రెస్ సాధించింది. బీఎస్పీ నుంచి గెలిచిన అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంతో ఈ రెండు పార్టీల బలం సమానంగా అయ్యాయి. ఇక్కడ బీజేపీ రెండు స్థానాలతోపాటు, ఎక్స్అఫీషియో సభ్యుల ఓట్లు కీలకంగా మారాయి.
● జహీరాబాద్లో బీఆర్ఎస్కు 15 స్థానాలు ఉండగా మ్యాజిక్ ఫిగర్ చేరుకునేందుకు ఇంకా నాలుగు కౌన్సిలర్ల స్థానాలు అవసరం ఉన్నాయి. కాంగ్రెస్కు 14 గెలుపొందగా, ఐదు కౌన్సిలర్లు అవసరం అవుతాయి. ఇక్కడ బీజేపీ మూడు, ఎంఐఎం రెండు, స్వతంత్రులు ముగ్గురు కీలకంగా మారారు. వీరి మద్దతు కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్లు వారి వారి స్థాయిల్లో ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి.
● కోహీర్లో 16 స్థానాల్లో ఎనిమిది కాంగ్రెస్కు రాగా, ఐదు బీఆర్ఎస్కు వచ్చాయి. ఎంఐఎం, బీజేపీ, ఇండిపెండెంట్లలో ఒకరి మద్దతు కోసం కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
● ఇస్నాపూర్, ఇంద్రేశం, జిన్నారంలో హంగ్ రావడంతో బీఆర్ఎస్, కాంగ్రెస్లు చైర్మన్ స్థానాల కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక్కడ ఎమ్మె ల్యే మహిపాల్రెడ్డి స్వతంత్రుల మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇస్నాపూర్లో స్వతంత్ర అభ్యర్థిని కాంగ్రెస్, బీఆర్ఎస్లు క్యాంపునకు తరలించే ప్రయత్నాలు జరగడం చర్చనీయాంశంగా మారింది.


