భోజనమైనా పెట్టరా?
మున్సిపల్ అధికారుల తీరుపైకౌంటింగ్ సిబ్బంది ఆగ్రహం
జోగిపేట(అందోల్): జోగిపేట మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్లో పాల్గొన్న సిబ్బందికి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా భోజనం ఏర్పాటు చేయకపోవడంతో కౌంటింగ్ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. అందోల్లోని బాలికల పాలిటెక్నిక్ కళాశాలలో 50మంది వరకు ఎన్నికల కౌంటింగ్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం భోజనం కోసం మున్సిపల్ అధికారులను ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో వెనుదిరిగి వెళ్లిపోయారు. అదేసమయంలో పోలీస్ శాఖకు మాత్రం హోటల్ నుంచి తెప్పించారు. కౌంటింగ్ సిబ్బంది కొందరు అక్కడికి వెళ్లగా మీకు ఇక్కడ భోజనం రాలేదంటూ వెనక్కి పంపించేశారు. ఉదయం కనీసం టిఫిన్లను కూడా ఏర్పాటు చేయలేదని, బీపీ, షుగర్ పేషంట్లు చాలామంది ఉన్నారని, ఇలాంటి ఎన్నికల ఏర్పాట్లు ఎక్కడా చూడలేదంటూ మున్సిపల్ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు.


