ఉడకని అన్నం.. నీళ్ల చారు
నాణ్యమైన భోజనం లేదని విద్యార్థుల ఆందోళన
నారాయణఖేడ్: ఖేడ్ మండలం జూకల్ శివారులోని గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల విద్యార్థులు నాణ్యమైన భోజనం పెట్టడం లేదంటూ గురువారం ఆశ్రమ పాఠశాల ఎదుట రహదారిపై భోజనం పారబోసి ధర్నా, రాస్తారోకో చేపట్టారు. మెనూ ప్రకారం భోజనం పెట్టకుండా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఉడికీ ఉడకని అన్నం నీళ్లచారు పెడుతుండగా తమ ఆరోగ్యాలు పాడవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు విషయం తెలుసుకుని అక్కడకు చేరుకుని విద్యార్థులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. ఆందోళన నేపథ్యంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి నీలిమకుమారి, ఇన్చార్జి డీడీ చందన, స్థానిక తహసీల్దారు షబానా బేగం, ఎంపీడీవో శ్రీనివాస్రెడ్డి ఆశ్రమ పాఠశాలను సందర్శించి అల్పాహారం జీరా రైస్, సాంబారును స్వయంగా రుచి చూసి అసంతృప్తి వ్యక్తం చేశారు. వార్డెన్తోపాటు ఫుడ్ సేఫ్టీ కమిటీ సభ్యులైన ముగ్గురు ఉపాధ్యాయులు, ఏఎన్ఎంకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.


