అభివృద్ధి, సంక్షేమంపై సానుకూలం
నారాయణఖేడ్: రెండేళ్ల కాంగ్రెస్ ప్రజా పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపట్ల ప్రజల్లో సానుకూలత వ్యక్తమవుతోందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, ఖేడ్ మున్సిపల్ ఎన్నికల కాంగ్రెస్ పరిశీలకులు గజ్జెలకాంతం, జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. విలేకరులతో మంగళవారం వారు మాట్లాడుతూ..రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున మున్సిపల్ కౌన్సిలర్లుగా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే మరింత అభివృద్ధి, ప్రజల సమస్యలను పరిష్కరించడానికి అవకాశం ఉంటుందన్నారు. ఖేడ్ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రూ.100 కోట్లయినా ఇవ్వడానికి సానుకూలంగా ఉన్నారని గజ్జెలకాంతం తెలిపారు. ప్రజల్లో మంచి స్పందన ఉందని, రాష్ట్రంలో 85%పైగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాకేశ్ షెట్కార్, నాయకులు నగేశ్ షెట్కార్, రషీద్, తాహెర్ అలీ పాల్గొన్నారు.


