మూగబోయిన మైకులు
ముగిసిన మున్సిపల్ ప్రచారం
● మూతపడిన మద్యం దుకాణాలు ● డబ్బుల పంపిణీలో నిమగ్నమైన అభ్యర్థులు
సంగారెడ్డి: మున్సిపల్ ప్రచారానికి తెరపడింది. ఇక ఓటర్లకు గాలం వేసే పనిలో నిమగ్నమయ్యారు అభ్యర్థులు.గత వారం పది రోజులుగా మైకులు, డీజేలు ప్రచార రథాలు, మీటింగులు, ర్యాలీలు, కార్నర్ మీటింగులు, రోడ్ షోలతో ఎవరి బలబలాలు వారు ప్రదర్శించారు. ఎవరి స్థాయికి వారు ప్రచారం చేసి తమ నాయకుల మెప్పు పొందారు. భారీ జనాలతో తమ అధినాయకత్వం మెప్పునైతే పొందారు కానీ.. ఓటర్ల మెప్పును పొందుతారా? లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇన్నాళ్లు వాడవాడలా తమ గుర్తింపును ప్రదర్శించారు. ఇక ఈ 48 గంటల్లోనే వారి ప్రతిఫలం బ్యాలెట్ బాక్స్లో నిక్షిప్తం కానుంది. వారం పది రోజులుగా ప్రచారంలో పాల్గొని తమకు అండగా నిలిచి ఉన్న వారందరూ తమకు ఓటును వేస్తారా? లేదా అనే విషయం ఎవరికీ అంతుచిక్కకుండా ఉంది. అభ్యర్థులు ఈ నలభై ఎనిమిది గంటలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు డబ్బులు, మద్యం, అభిమానం పంచేందుకు సిద్ధమయ్యారు. ఓటర్లు మాత్రం చివరికి ఎవరికి పట్టం కడతారో 13వ తేదీన బట్టబయలు కానుంది. అయితే ప్రతి అభ్యర్థి ఎంతో కొంత ఖర్చు చేసి గెలవాలని యోచిస్తున్నట్లు తెలుస్తుంది.


