ప్రేమ జంట ఆత్మహత్య
సిద్దిపేట జిల్లాలో ఘటన
సిద్దిపేటరూరల్: ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం మండల పరిధిలోని పెద్ద లింగారెడ్డిపల్లి శివారులో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు... నారాయణరావుపేట మండల కేంద్రానికి చెందిన మాదన్నగారి యాదగిరి కుమారుడు శ్రావణ్ (21), పెద్దకోడూరు గ్రామానికి చెందిన బోనాల లింగం రెండో కూతురు నవ్య (17) కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఇరువురి కుటుంబీకులకు తెలియడంతో ఒప్పుకొని, అమ్మాయి మేజర్ అయ్యాక పెళ్లి చేస్తామని అనుకున్నారు. ఇదిలా ఉండగా.. నవ్య రోజులాగే కాలేజీకి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లింది. శ్రావణ్ కొత్త బట్టలు కొంటానని తల్లికి చెప్పి ఇంట్లో నుంచి వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో పెద్దలింగారెడ్డిపల్లి గ్రామానికి చెంది రైతు తన వ్యవసాయ బావి వద్దకు వెళ్తున్న క్రమంలో పక్కనే చెట్టుకు ఉరివేసుకుని ఉన్న ఇద్దరిని గమనించి, గ్రామస్తులకు సమాచారం అందించాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతుల వివరాలు సేకరించి కుటుంబీకులకు చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట జనరల్ ఆస్పత్రికి తరలించారు. ప్రేమికులు ఇద్దరు వరుసకు మేనబావ, మరదలు. కాగా యువతి బ్యాగులో చీర, పుస్తకాలు లభించాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతికి గల కారణాలు విచారణలో తెలుస్తాయని తెలిపారు.


