పోలింగ్కు సర్వం సిద్ధం
రేపు ఉదయం 7 నుంచి పోలింగ్
● ముగిసిన ప్రచార కార్యక్రమాలు ● 256 వార్డులకు ఎన్నికల నిర్వహణ ● ఓటు వేయనున్న 3,41,806 మంది ఓటర్లు
సంగారెడ్డిజోన్: మున్సిపల్ ఎన్నికల పోరుకు రంగం సిద్ధమైంది. 11న పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 11 మున్సిపాలిటీల పరిధిలో 256 వార్డులకు ఎన్నికలు జరగతున్నాయి. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
256 వార్డులు, 541 పోలింగ్ కేంద్రాలు
జిల్లాలో 256 కౌన్సిలర్ పదవులకు జరిగే పోలింగ్ కోసం 541 కేంద్రాలను ఏర్పాలు చేశారు. బుధవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పో లింగ్ జరగనుంది. 3,41,806 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. 13న ఓట్ల లెక్కించి అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు.
ఎన్నికల అధికారులకు శిక్షణ పూర్తి
ఎన్నికల విధులు నిర్వహించే అధికారులకు ఇప్పటికే విడతలవారీగా శిక్షణ అందించారు. పోలింగ్ ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు చేపట్టాల్సిన విధులపై ఉన్నతాధికారులు అవగాహన కల్పించారు. అదేవిధంగా కౌంటింగ్కు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం 93 మంది రిటర్నింగ్ అధికారులు, 1,298 మంది ప్రిసైడింగ్ అధికారులను నియమించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి అదనపు బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే 11 వందల మంది పోలీసు అధికారులను నియమించారు.
నేడు పంపిణీ
పోలింగ్ నిర్వహణకు అవసరమయ్యే సామగ్రిని మంగళవారం మున్సిపాలిటీ కేంద్రాలలో సంబంధిత అధికారులకు పంపిణీ చేయనున్నారు. బ్యాలెట్ బాక్సులు, పేపర్లు, స్టేషనరీతో పాటు అధికారుల కేటాయింపు జరగనుంది. సాయంత్రానికి వారంతా తమ కేటాయించిన కేంద్రాలకు తరలి వెళ్తారు.
మూగబోయిన మైకులు
వారం రోజులుగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలు జోరుగాసాగాయి. ఎన్నికల సంఘం నిబంధన మేరకు సోమవారం సాయంత్రం 5 నుంచి ప్రచారాలు బంద్ అయ్యాయి. మైకులు మూగబోయాయి. పోలింగ్కు 48 గంటల ముందు ఎలాంటి ప్రచార కార్యక్రమాలకు అనుమతి లేదు. మద్యం దుకాణాలు సైతం మూతపడ్డాయి.
ఎన్నికల సామగ్రి పంపిణీకి ఏర్పాట్లు
నారాయణఖేడ్: మున్సిపల్ పోలింగ్ పురస్కరించుకొని నారాయణఖేడ్ పట్టణ శివారులోని పాలిటెక్నిక్ కళాశాలలో డిస్ట్రిబూషన్ కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. పోలింగ్ బాక్సులు అక్కడ సిద్ధం చేశారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పీఓ, ఏపీఓ, సిబ్బంది సామగ్రి తీసుకెళ్లేందుకు కౌంటర్లను ఏర్పాటు చేశారు. పోలింగ్ అనంతరం ఇక్కడే స్ట్రాంగ్ రూంను ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ పరిశీలించారు. ఖేడ్ మున్సిపలిటీలో 15 వార్డులకు గాను 30 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.


