విద్య, వైద్య రంగాలను అభివృద్ధి చేస్తా
జోగిపేట ప్రచారంలో మంత్రి దామోదర
జోగిపేట(అందోల్): అందోల్ – జోగిపేట మున్సిపాలిటీని విద్య, వైద్య కేంద్రంగా అభివృద్ధి చేస్తానని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. సోమవారం జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని 2,3,20, 10వ వార్డుల్లో అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు. ఎన్సీడీ క్లినిక్, ట్రామా సెంటర్, క్యాన్సర్ పరీక్షల కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, ఏఎంసీ చైర్మన్ జగన్ మోహన్రెడ్డి, మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి, పార్టీ పరిశీలకులు కైలాశ్ కుమార్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
అదనపు కలెక్టర్ పాండు
సంగారెడ్డి: జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు అదనపు కలెక్టర్ పాండు తెలిపారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లోని తన చాంబర్ నుంచి మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లు అన్ని విధాల సౌకర్యవంతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, పోలింగ్ మెటీరియల్ తో పోలింగ్ సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు ఎస్కార్ట్ వాహనంతో తరలించాలని తెలిపారు. జోనల్ ఆఫీసర్లు, ఆర్వోలు, ఎన్నికల సిబ్బంది ప్రతి ఒక్కరూ ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. అందరూ సమష్టిగా కృషి చేసి జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేయాలని కోరారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జెడ్పీ సీఈఓ జానకీరెడ్డి, డీఆర్డీఓ అదనపు పీడీ బాలరాజ్, మున్సిపల్ కమిషనర్లు తదితర అధికారులు పాల్గొన్నారు.
ప్రైవేటీకరణపై కార్మిక లోకం పోరాడాలి
సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీరయ్య
రామచంద్రాపురం(పటాన్చెరు): ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీరయ్య అన్నారు. సోమవారం బెల్ కాలనీలో ఈనెల 12వ తేదీన దేశవ్యాప్తంగా జరగనున్న సమ్మె సందర్భంగా వివిధ కార్మిక సంఘాల నేతలతో సమ్మె సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లేబర్ కోడ్ రద్దు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణపై కార్మిక లోకం కన్నెర్ర చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. ఈ సమ్మెలో కార్మికుల ఐక్యతను చూపించాలన్నారు. ఉద్యమాలతోనే హక్కులు సాధించుకుంటామని ఆయన తెలిపారు. కార్మిక చట్టాల రక్షణకు కార్మికులందరూ ఐక్యంగా పోరాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్మిక సంఘాల నేతలు మహిపాల్ రెడ్డి, శ్రీను, శ్రీనివాస్, రాజయ్య, సురేందర్, మధు, గడ్డం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఇళ్లు ఇక్కడ.. ఓటు అక్కడ
సదాశివపేట(సంగారెడ్డి): పట్టణంలోని పలు వార్డుల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. కొంతమంది వ్యక్తులకు ఇతర వార్డుల్లో ఓటరుగా పేరు నమోదైంది. దీంతో అభ్యర్థులు ఓటర్లను గుర్తించేందుకు అదనపు కసరత్తు చేయాల్సి వస్తోంది. వార్డు జాబితాల ఆధారంగా ఓటర్ల చిరునామా ఫోన్ నంబర్లు సేకరించి వారిని చేరుకునే పనిలో అభ్యర్థులు దృష్టిపెట్టారు. కొంతమంది ఓటర్లు నివాస ప్రాంతంలో లభించకపోవడంతో పక్క వార్డులు, కాలనీల వరకు వెతుకుతూ ప్రచారం నిర్వహించారు. పోటీ తీవ్రంగా ఉండడం.. ఒక్క ఓటు కూడ కీలకంగా మారడంతో అభ్యర్థులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.


