రైతులకు శుభవార్త
కౌడిపల్లి(నర్సాపూర్): ఇప్పటి వరకు విద్యార్థులకు వసతి గృహాలు చూసాం.. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ప్రైవేటు హాస్టల్స్ ఉన్నాయి. ప్రస్తుతం మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికి కేవీకేలో రైతుల కోసం ఓ వసతి గృహం సిద్ధం కాగా త్వరలో ప్రారంభం కానుంది.
మండలంలోని తునికి కేవీకేలో సేంద్రియ, ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఇక్కడి శాస్త్రవేత్తలు జిల్లాలోని పలు గ్రామాల్లో సేంద్రియ, ప్రకృతి వ్యవసాయంపై రైతులకు శిక్షణనిస్తున్నారు. క్షేత్రస్థాయిలో సేంద్రియ పంటల సాగు విధానాన్ని కేవీకేలో సాగు చేస్తూ ఎప్పటికప్పుడు రైతులకు కొన్నేళ్లుగా శిక్షణ ఇస్తున్నారు. కాగా ఒక్కోసారి రైతులు ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్తోపాటు ఇతర రైతులకు పంటసాగు, సస్యరక్షణ, నీటి యాజమాన్యం, సేంద్రియ ఎరువుల తయారీ వాటి వినియోగం, చీడపీడల నివారణ కోసం వివిధ రకాల కషాయాల తయారుచేసి వాడే విధానంపె శిక్షణనిస్తారు. దీంతో రైతులు వరుసగా ఐదు రోజులకుపైగా శిక్షణ ఇచ్చేవారు. దీంతో ప్రతిరోజు రైతులకు దూర ప్రాంతంలోని ఇంటికి వెళ్లి తిరిగి ఉదయం శిక్షణకు వచ్చేవారు. కాగా ఈ సమస్య ఇక తీరనుంది. కేవీకేలో ఐసీఏఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రిసర్చ్) ఆధ్వర్యంలో గత ఏడాది వసతి గృహం నిర్మాణానికి రూ. 84 లక్షలు మంజూరు చేసింది. ఆ నిధులతో వసతి గృహం నిర్మించినట్లు కేవీకే హెడ్ అండ్ సైంటిస్ట్ శంభాజీ దత్తాత్రేయ నల్కర్ తెలిపారు. వసతి గృహంలో 6 గదులు, టాయిలెట్స్ నిర్మించారు. 24 మంది రైతులు వసతి గృహంలో ఉండేందుకు వీలుంది. ఇక శిక్షణ సమయంలో రైతులు ఇక్కడే ఉండి పూర్తి స్థాయిలో శిక్షణను సద్వినియోగం చేసుకోనున్నారు. శిక్షణ స్థాయిని బట్టి శిక్షణ కాలంలో వసతి గృహంలో ఉండే రైతులకు ఉదయం టీ, టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. వసతి గృహాన్ని త్వరలో ప్రారంభించనున్నారు. దీంతో రైతులకు ఇబ్బందులు తప్పనున్నాయి.


