పెంటకుప్పలో పసికందు
బొడ్డు కూడా కోయకుండానే వదిలేసిన కన్నతల్లి ఏరియా ఆస్పత్రికి తరలించిన అంగన్వాడీ టీచర్, పోలీసులు మెదక్ జిల్లాలో ఘటన
చిలప్చెడ్(నర్సాపూర్): ఏ తల్లి కన్నబిడ్డో.. ఆ తల్లికి చెప్పుకోలేని కష్టమో.. లేక పెంచలేని పరిస్థిలో ఉందో తెలియదు కాని నవమాసాలు మోసిన కన్నబిడ్డను పుట్టిన కొద్ది గడియలకే పేగుబంధం తెంపుకుంది. నవజాత శిశువును పొలం పక్కన పెంటకుప్పలో విడిచిపెట్టి వెళ్లింది. పసికందును గమనించిన అంగన్వాడీ టీచర్ పోలీసులు, అధికారుల సహాయంతో ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ విషాద సంఘటన మెదక్ జిల్లా చిలప్చెడ్ మండలం భద్రియతండాలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ నర్సింహులు వివరాల ప్రకారం... భద్రియతండా సమీపంలో ఆదివారం ఉదయం తండాకు చెందిన మహిళ పొలంలో నీళ్లు తెచ్చేందుకు వెళ్లగా పక్కన పెంటకుప్పలో పసిపాప ఏడుపు వినిపించింది. దీంతో దగ్గరికెళ్లి చూసేసరికి గుర్తుతెలియని మగ శిశువు కనిపించింది. దీంతో విషయం అంగన్వాడీ టీచర్ అనిత, సర్పంచ్ కున్యకు చెప్పడంతో వారు పోలీసులకు, సీడీపీఓకు సమాచారం ఇచ్చారు. అనంతరం అధికారుల సూచనలతో పోలీస్ వాహనంలో శిశువును మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ శిశువుకు వైద్యులు చికిత్స చేశారు. మగశిశువు 1.96కిలోగ్రాములు బరువు ఉందని, ప్రస్తుతం ఆరోగ్యం బాగుందని చెప్పారు. పుట్టిన గంట, రెండు గంటలలోపు శిశువును అక్కడ వదిలి వెళ్లి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇంక బొడ్డు కూడా కోయలేదని చెప్పారు. ఆస్పత్రిలో వైద్యసిబ్బందితోపాటు మెదక్ బాలసదన్ అధికారుల పర్యవేక్షణలో ఉందని తెలిపారు. ఈ విషయంపై విచారణ చేస్తున్నట్లు పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు పేర్కొన్నారు.
అయ్యో పాపం.. ఏ తల్లి కన్నబిడ్డో..


