కోహెడలో పెద్దపులి కలకలం
● పులి దాడిలో నాలుగు లేగదూడలు, రెండు ఆవులు మృతి ● రైతులు, గ్రామస్తుల్లో భయాందోళన
కోహెడరూరల్(హుస్నాబాద్): మండలంలో పెద్దపులి సంచారం కలకలం సృష్టిస్తోంది. మండలంలోని బస్వాపూర్, కూరెళ్ల గ్రామాల శివారులో ఆదివారం పెద్దపులి పశువులపై దాడి చేసింది. ఈ దాడిలో నాలుగు లేగదూడలు, రెండు ఆవులు మృత్యువాత పడ్డాయి. ఆరేపల్లి గ్రామ పరిధిలోని చంద్రనాయక్ తండాకు చెందిన మాలోతు రమేశ్ నాయక్కు చెందిన లేగ దూడలు, ఆవులను పెద్దపులి చంపినట్లు తెలిపాడు. పులి సంచారం కారణంగా వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో సంబంధింత గ్రామాల సర్పంచ్లు బందెల సుజాత, పిల్లి బాబు, లింగంపల్లి లక్ష్మయ్య, సామాజిక మాధ్యమాల్లో మెసేజ్, దండోరా వేయించి ప్రజలను అప్రమత్తం చేశారు. వ్యవసాయ బావుల వద్దకు ఒంటరిగా వెళ్లవద్దని తహసీల్దార్ చంద్రశేఖర్, పోలీసులు గ్రామస్తులకు సూచించారు. ఎస్ఐ అభిలాష్, అటవీశాఖ అధికారులతో కలిసి సింగరాయ గుట్టలలో గాలింపు చేపట్టారు. డ్రోన్ కెమెరా, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు ఫారెస్టు అధికారులు తెలిపారు. పులి సంచారం విషయం తెలుసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా అధికారులు, అటవీ శాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. పులి దాడిలో మృతి చెందిన పశువులకు ప్రభుత్వం నుంచి త్వరలోనే నష్ట పరిహారం చెల్లించేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అలాగే అటవీ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, పులిని పట్టుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.


