నేటితో ప్రచారం బంద్
హోరాహోరీగా ప్రచార కార్యక్రమాలు
సంగారెడ్డి జోన్: మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు సోమవారంతో బంద్ కానున్నాయి. నిబంధనల ప్రకారం పోలింగ్కు 48 గంటల ముందు ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదు. గత వారం రోజులుగా అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఓట్ల కోసం ప్రజలను అభ్యర్థించారు. ప్రచారానికి సమయం తక్కువగా ఉండటంతో తమ మద్దతుదారులతో కలిసి రాత్రి, పగలు తేడా లేకుండా ఓటర్లకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు.
హోరాహోరీగా ప్రచారాలు
అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి హోరాహోరీగా ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. తమ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా మంత్రులు, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ప్రజా ప్రతినిధులు ప్రచారాలు పాల్గొన్నారు. భారీ ర్యాలీలు, కార్నర్ మీటింగ్లు నిర్వహిస్తున్నారు. నేరుగా ఓటర్లను కలవడంతోపాటు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్లలో తమ గుర్తులతో పాటు హామీలను ప్రజలకు చేర్చారు. తమ పరిధిలోని ఓటర్లకు ఐవీఆర్ఎస్ సిస్టం ద్వారా మెసేజ్, ఫోన్ కాల్స్ ద్వారా మద్దతు కోరుతున్నారు. డిజిటల్ స్క్రీన్లను ఏర్పాటు చేశారు.
అభ్యర్థుల్లో టెన్షన్..టెన్షన్
జిల్లాలో 11 మున్సిపాలిటీల పరిధిలో 256 వార్డులున్నాయి. కౌన్సిలర్ల పదవికి ప్రధాన పార్టీలతోపాటు స్వతంత్ర అభ్యర్థులు 1,045 మంది బరిలో ఉన్నారు. తాము గెలిస్తే చేసే అభివృద్ధి పనుల మేనిఫెస్టోను రూపొందించి ఓటర్ల ముందు ఉంచారు. పోలింగ్కు సమయం దగ్గర పడుతుండటంతో అభ్యర్థుల్లో గెలుపోటముల టెన్షన్ మొదలైంది.
11న పోలింగ్.. 13న ఫలితాలు
ఈనెల 11న పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. 256 వార్డులకు 541 పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఎక్కడైనా అవసరమైతే 12 న రీ–పోలింగ్ జరుపుతారు. 13న ఉదయం 8:00 నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి, అనంతరం ఫలితాలను ప్రకటిస్తారు.
బరిలో 1,045 మంది అభ్యర్థులు


