తగ్గిన యాసంగి సాగు
సింగూరు ప్రాజెక్టు మరమ్మతులతో యాసంగికి క్రాప్ హాలీడే బోరు బావులు, చెరువు ఆయకట్టు రైతులు సాగువైపు మొగ్గు బీడుగా మారిన కాలువ ఆయకట్టు
యాసంగి నాట్లు వేస్తున్న కూలీలు
పుల్కల్ (అందోల్): సింగూరు ప్రాజెక్టు మరమ్మతుల కారణంగా పంట విరామం (క్రాప్ హాలీడే) ప్రకటించడంతో జిల్లాలో యాసంగి సాగు తగ్గింది. కేవలం బోరు బావులున్న రైతులే వరినాట్లు వేస్తున్నారు. పదేళ్లుగా సింగూరు సాగునీటితో ఏటా రెండు పంటలు పండించిన రైతులు ఈ యాసంగిలో మరమ్మతుల వల్ల నీటి పారుదల శాఖ అధికారులు క్రాప్ హాలీడే ప్రకటించడంతో బోరు బావులు, చెరువు ఆదేరువు, మంజీరానది పరీవాహకంలో ఉన్న రైతులు మాత్రమే వరి సాగు వేస్తున్నారు. దీంతో సగానికి పైగా పంట విస్తీర్ణం తగ్గిందని వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు చెబుతున్నారు. వేసవి కావడంతో నీటి ఆదేరువు, విద్యుత్ సరఫరాలో జరిగే అంతరాయాన్ని దృష్టిలో పెట్టుకుని సాగు విస్తీర్ణం తగ్గించామని రైతులు తెలిపారు. కొందరు రైతులు ఆరుతడి పంటలు వేసిన ఎక్కువమంది రైతులు వరి పంటకే మొగ్గు చూపారు.
బీళ్లుగా మారిన కాలువ ఆయకట్టు
సింగూరు మరమ్మతుల దృష్ట్యా క్రాప్ హాలీడే ప్రకటించడంతో ఆయకట్టు అంత బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. గత పదేళ్లుగా 40 వేల ఎకరాల వరకు రెండు పంటలతో కళకళలాడిన నేల నేడు బీళ్లుగా దర్శనమివ్వడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరమ్మతులు రెండేళ్లపాటు సాగుతుండటంతో అంతవరకు మా భూములు బీళ్లుగానే మారుతాయని రైతులు తెలిపారు.
తగ్గిన యాసంగి సాగు


