జెండా పట్టుకో..!
పాంచ్సౌ పుచ్చుకో..
● కూలీ చెల్లించి మరీ ప్రచారానికి జనం
● దూరంగా ఉన్న ఓటర్లకు ఫోన్కాల్
● రాత్రి పెద్ద ఎత్తున విందులు
జిల్లాలోని 11 మున్సిపాలిటీల్లో 256 వార్డుల్లో 1045 మంది పోటీ చేస్తున్నారు. 11 మున్సిపాలిటీల్లో 1,72,521 మహిళలు, 1,70,102 పురుష ఓటర్లు మొత్తం 3,42,659 ఓటర్లు ఉన్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు బరిలో నిలిచిన అభ్యర్థులు తమ తమ వార్డుల్లో ఉదయం నుంచి రాత్రి వరకు ప్రచారం చేస్తున్నారు. ప్రచార సమయంలో తన వెంట ఎక్కువ మంది కనిపించేలా ప్లాన్ చేసుకుంటున్నారు. స్థానిక వార్డు మహిళలతో పాటు మిగతా వార్డుల్లోని మహిళలను రప్పించి రోజుకు రూ.500 కూలీ చెల్లించి తమ వెంట ప్రచారానికి తిప్పుతున్నారు. వారు జెండా పట్టుకొని అభ్యర్థుల వెంట ఉంటూ ప్రచారం చేస్తున్నారు. పోటీలో మహిళలు ఉంటే మన అక్కకే ఓటేయాలి, అక్క గెలుపుతోనే వార్డు అభివృద్ధి అంటూ నినాదాలు చేస్తున్నారు. ప్రచారానికి వచ్చే వారికి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. పురుషులు ప్రచారానికి వస్తే అదనంగా మందు పోస్తున్నారు. దీంతో పట్టణంలోని చికెన్, మటన్ సెంటర్లకు గిరాకీ పెరిగింది. సాధారణ రోజులతో పోల్చితే ఇప్పుడు చికెన్, మటన్, బిర్యానీ ఆర్డర్లు రెట్టింపయ్యాయని హోటళ్ల నిర్వాహకులు తెలిపారు.
అభ్యర్థుల పాట్లు
ప్రచారంలో అభ్యర్థులు నానా పాట్లు పడుతున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు చాయ్ అమ్మడం, కూరగాయలు అమ్మడం లాంటి వినూత్న ప్రచారం చేస్తున్నారు. ఓటరు జాబితాను దగ్గర పెట్టుకొని హైదరాబాద్ ఇతర ప్రాంతాల్లో ఉన్న వారికి ఉదయం, రాత్రి ఫోన్ చేసి రానుపోను ఖర్చులు చెల్లిస్తానని.. ఈనెల 11న వచ్చి ఓటు వేయాలని కోరుతున్నారు.
మున్సిపల్ ఎన్నికల పుణ్యమా అని చాలా మందికి పుష్కలంగా ఉపాధి లభిస్తుంది. ప్రతి రోజు ఉదయం సాయంత్రం పలువురు అభ్యర్థుల వెంట ప్రచారానికి వెళ్తున్నారు. వారికి రోజుకు రూ.500 కూలీ చెల్లిస్తున్నారు. అభ్యర్థి పార్టీ జెండా పట్టుకొని పోటీలో మహిళలు ఉంటే అక్కకే ఓటేయాలని, ఆమె గెలుపుతోనే వార్డు అభివృద్ధి అంటూ నినాదాలు చేస్తూ ప్రచారం చేస్తున్నారు.
–సదాశివపేట(సంగారెడ్డి)
ప్రచారంలో జోరు
ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఖర్చుకు వెనుకాడకుండా జోరుగా ప్రచారం చేస్తున్నారు. వార్డుల్లో అభ్యర్థులు ర్యాలీలు, నిర్వహిస్తూ హోరెత్తిస్తున్నారు. ప్రచారానికి అధిక సంఖ్యలో ప్రజలతో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ప్రచారానికి వచ్చే వారికి ప్రతి రోజు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం చికెన్, మటన్, ఎగ్స్తో భోజనంతోపాటు రూ .500 ఇస్తున్నారు. రాత్రి సమయంలో పెద్ద ఎత్తున విందులు ఇస్తున్నారు. తమతోపాటు ప్రచారానికి వస్తున్న పురుషులకు మందు అలవాటు ఉన్నవారికి మందు ఇస్తున్నారు.


