ప్రలోభాలకు లొంగవద్దు
ఎంపీ రఘునందన్రావు
బహిరంగసభలో మాట్లాడుతున్న
ఎంపీ రఘునందన్రావు
సదాశివపేట(సంగారెడ్డి): మున్సిపల్ ఎన్నికల్లో డబ్బుల, మద్యం వంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎంపీ రఘునందన్రావు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్పార్టీల మోసపూరిత వాగ్దానాలు మాటలు నమ్మి ప్రజలు మరోసారి మోసపోవద్దని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సదాశివపేట పట్టణం గాంధీచౌక్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మళ్లీ ఏ ముఖం పెట్టుకుని కాంగ్రెస్ ఓట్లు అడుగుతుందో ప్రజలు నిలదీయాలన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఇచ్చే వేయి, రెండు వేలకు ఓటర్లు లొంగిపోకుండా ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. సిద్దిపేటలో కోట్ల నిధులతో అండర్గ్రౌండ్ డ్రైయినేజీ, కోమటిచెరువు అభివృద్ధి చేసిన హరీశ్రావు సంగారెడ్డి, సదాశివపేటలో ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజలకు పనిచేస్తున్నారా? పరిశ్రమలకు, రియల్ ఎస్టేట్ వాళ్లకు పనిచేస్తున్నారా? ప్రజలు ఆలోచించాలన్నారు. బీఆర్ఎస్ పదేళ్లపాలనలో తాగుబోతుల తెలంగాణ మార్చారన్నారు. రేషన్ బియ్యంలో రాళ్లున్నాయని అడిగితే చెంపచెళ్లుమనిపించిన జగ్గారెడ్డి అప్పుడప్పుడూ వచ్చి చాయ్, నిమ్మరసం దుకాణంలో రూ.లక్ష పంచితే అభివృద్ధి అయినట్లా అని ప్రశ్నించారు. సదాశివపేటలో పార్కు, స్టేడియం లేదని ఇక్కడి నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఏ అభివృద్ధి పనులు చేశారో చెప్పాలని నిలదీశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ముస్లింలను బతిమిలాడి ఓట్లు వేయించుకుని దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు జయశ్రీ, కోవూరి సంగమేశ్వర్, చంద్రశేఖర్, మాణిక్రావు, రాజేశ్వరీ 21 వార్డుల బీజేపీ అభ్యర్థులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


