ఐదేళ్ల బాలుడిపై కుక్కల దాడి
తీవ్ర గాయాలు
పటాన్చెరు టౌన్: ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలో వీధి కుక్కల దాడి కలకలం రేపింది. శుక్రవారం ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని ఆర్.కే నగర్ కాలనీకి చెందిన ఐదేళ్ల బాలుడు శివ స్థానికంగా ఆడుకుంటుండగా.. ఒక్కసారిగా ఐదు కుక్కలు అతడిని చుట్టుముట్టి దాడి చేశాయి. స్థానికులు వెంటనే కుక్కలను తరిమివేయడంతో అక్కడి నుంచి పారిపోయాయి. ఈ ప్రమాదంలో బాలుడికి తీవ్ర గాయాలు కావడంతో తక్షణమే సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఇంద్రేశంలో వీధి కుక్కల సంఖ్య అధికంగా పెరిగిపోయిందని, పలుమార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న పిల్లల భద్రత దృష్ట్యా వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
బ్రాహ్మణపల్లిలో ఐదుగురికి గాయాలు
వట్పల్లి(అందోల్): అందోల్ మండలం బ్రాహ్మణపల్లిలో శుక్రవారం పిచ్చికుక్క వీరవిహారం చేసి ఐదుగురిని గాయపరిచింది. శుక్రవారం సాయంత్రం వేళ ఇళ్ల ముందు కూర్చున్న పెద్దగొల్ల విఠల్, పెద్దగొల్ల మల్లేశం, సామల రాములు, సామల రవి, మొగులయ్యలను పిచ్చికుక్క కరిచింది. దీంతో వీరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే పిచ్చికుక్కను వెంబడించి కర్రలతో కొట్టి చంపారు. గాయపడిన వారందరూ వెంటనే జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకున్నారు. కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


