బగలాముఖీ శక్తిపీఠం సంకల్పం గొప్పది
బగలాముఖీ అమ్మవారు, భక్తులకు సందేశం ఇస్తున్న విద్యా శంకర భారతీస్వామి
శివ్వంపేట(నర్సాపూర్): మండల కేంద్రంలోని బగలాముఖీ శక్తిపీఠం సంకల్పం చాలా గొప్పదని పుష్పగిరి పీఠాధిపతి విద్యా శంకర భారతీస్వామి పేర్కొన్నారు. శుక్రవారం శక్తిపీఠం తృతీయ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. భగవంతుని నామస్మరణతో ప్రతి ఒక్కరూ భక్తిమార్గంలో ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా బగలాముఖీ అమ్మవారికి గణపతిపూజ, పుణ్యహవాచనం, అగ్నిప్రతిష్ట, పల్లకిసేవ, తదితర పూజలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి పాల్గొని పూజలు చేశారు. ఆలయ భూదాత పబ్బ స్వరూప రమేశ్గుప్తా, హైదరాబాదుకు చెందిన వెంకట్రెడ్డి భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పురోహితులు పురుషోత్తమశర్మ, దేవదాత్తశర్మ, వామనశర్మ, మాజీ జడ్పీటీసీ మహేశ్గుప్తా, సర్పంచ్ వెంకటేశ్వర్లు, గ్రామస్తులు ఉన్నారు.
పుష్పగిరి పీఠాధిపతి విద్యా శంకర భారతీస్వామి
బగలాముఖీ శక్తిపీఠం సంకల్పం గొప్పది


