గిరిపుత్రుల కళాశా‘లా’
దేశంలోనే మొదటి ట్రైబల్ ‘లా’కాలేజీ విద్యార్థులకు ఉచిత శిక్షణ, వసతి కళాశాల బృందం అవగాహనకార్యక్రమాలు ‘లా’ఎంట్రన్స్తో అవకాశాలు మే18న ‘లా’సెట్
సంగారెడ్డి టౌన్: గిరిజనులు న్యాయ విద్య అభ్యసించేలా మొట్టమొదటి గిరిజన పురుషుల ‘లా’కళాశాలను ఐదేళ్ల కిందట సంగారెడ్డిలో ఏర్పాటు చేశారు. దేశంలోనే మొదటి తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల న్యాయ కళాశాల ఇది. గిరిజనులు న్యాయవిద్యను అభ్యసించేలా ఉచిత కళాశాలతోపాటు హాస్టల్ వసతి కల్పిస్తోంది. లా సెట్లో ఉత్తీర్ణులైన వారు విద్యను అభ్యసించవచ్చు. ఉస్మానియా వర్సిటీకి అనుబంధంగా ఐదేళ్లపాటు ఇంటిగ్రేటెడ్ కోర్సును అందిస్తోంది. విజయవంతంగా కోర్సు పూర్తిచేసిన వారికి బీఏ, ఎల్ఎల్బీ న్యాయశాస్త్ర పట్టాను అందించనున్నది. ఈ కళాశాలకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతి ఉంది.
ఐదేళ్ల కోర్సు...
ఇంటర్మీడియెట్ అర్హతతో లా సెట్ రాసిన వారిలో ప్రతిభ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ఇతరులకు రిజర్వేషన్లు కూడా ఉంటాయి. ఐదేళ్లలో బీఏ ఎల్.ఎల్.బి పూర్తి చేసేందుకు వీలుంటుంది. ప్రతీ ఏటా 60 మందికి ప్రథమ సంవత్సరంలో సీట్లు కేటాయిస్తున్నారు. లా ప్రవేశ పరీక్షకు ఫిబ్రవరి 8 నుంచి ఏప్రిల్ 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అదనపు రుసుముతో మే 15 వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. పరీక్ష మే 18న నిర్వహించనున్నారు.
ఉచిత వసతి సౌకర్యం..
కళాశాలలో చదువుకునే విద్యార్థులకు ఉచిత విద్యతోపాటు భోజనం, వసతి కల్పిస్తారు. ఎలాంటి ఖర్చు లేకుండానే కోర్సు పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుంది. ప్రతీనెల పాకెట్ మనీ రూపంలో డబ్బులను అందజేస్తారు. కాలేజీలోని గ్రంథాలయంలో పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులకు కళాశాలలో సీనియర్ న్యాయవాదులతో ప్రత్యేక తరగతులను నిర్వహిస్తారు.
విద్యార్థుల కోసం వ్యాయామశాల ఏర్పాటు చేశారు. అలాగే న్యాయవాదులతో అవగాహన సదస్సులు నిర్వహిస్తుంటారు. స్పోకెన్ ఇంగ్లిష్, పీజీ కోర్సులకు సంబంధించిన తరగతులను నిర్వహిస్తుంటారు. జిల్లా, హైకోర్టులలో ఇంటర్నషిప్ కల్పిస్తారు. ఇంటర్న్షిప్కు వెళ్లినప్పుడు స్టైపెండ్ రూపంలో డబ్బులు అందజేస్తారు. జిల్లాలలోని ప్రతీ తండాలలో కళాశాల ఉపాధ్యాయులు ఇంటర్ ఆపై చదివిన విద్యార్థులకు లా కళాశాలలో ప్రవేశం పొందేందుకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
మారుమూల తండా నుంచి వచ్చా
మారుమూల తండా నుంచి వచ్చి ఇక్కడ న్యాయ విద్యను అభ్యసిస్తున్నాను. పేదవారికి న్యాయం అందించాలనే లక్ష్యంతో న్యాయ శాస్త్రం చదువుతున్నాను. శిక్షణ కోసం కోర్టుకు వెళ్లినప్పుడు వారు చెప్పే సలహాలు, సూచనలను అనుసరిస్తూ శిక్షణ తీసుకుంటున్నాను. న్యాయవాదిగా పేరు తెచ్చుకుని పేద వారికి న్యాయసేవ చేస్తాను.
– చందు నాయక్, విద్యార్థి,సూర్యాపేట జిల్లా, పాలకీడు మండలం
సద్వినియోగం చేసుకోవాలి
సంగారెడ్డిలోని గిరిజన సంక్షేమ గురుకుల న్యాయ కళాశాలను విద్యార్థులు ఎంపిక చేసుకుని సద్వినియోగం చేసుకోవాలి. గ్రామాలలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. 60 సీట్లలో 51 సీట్లు ఎస్టీలకే ఉన్నాయి. మిగతావి ఇతర రిజర్వేషన్లకు భర్తీ చేస్తారు. ఇక్కడ చదివితే విద్యార్థులకు మంచి భవిష్యత్ ఉంటుంది.
– శ్రీనివాస్, ‘లా ’కళాశాల ప్రిన్సిపాల్


