కానరాని ఆప్షన్.. విద్యార్థుల్లో టెన్షన్
ఈపాస్ ఆన్లైన్లో కనిపించనిమోడల్ స్కూల్స్ ఆప్షన్ ఆందోళనలో ఎస్సీ విద్యార్థులు,తల్లిదండ్రులు
సాక్షి, సిద్దిపేట ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్నకు దరఖాస్తు చేసేందుకు మోడల్ స్కూల్ ఆప్షన్ రావడం లేదు. విద్యార్థులకు చేయూత అందించేందుకు ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్లను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తోంది. Telanganaepass.cgg.gov.in లో దరఖాస్తులు చేసుకోవాలని పాఠశాలల హెచ్ఎంలు విద్యార్థులకు సమాచారం అందించారు. దీనిలో భాగంగా ఆన్లైన్లో విద్యార్థుల నుంచి దరఖాస్తులను చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 31, సిద్దిపేట జిల్లాలో 14 మోడల్ స్కూల్స్ ఉండగా వాటిలో సగానికి పైగా పేర్లు రాకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
5 నుంచి పదో తరగతి విద్యార్థుల వరకు
5 నుంచి 10వ తరగతి విద్యను అభ్యసిస్తున్న ఎస్సీ విద్యార్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో 5 నుంచి 8వ తరగతి బాలురకు రూ.1,000, బాలికలకు రూ.1,500లు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో 9,10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు రూ.3,500 అందజేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 194 మోడల్ స్కూళ్లలో లక్షకు పైగా ఎస్సీ విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. చాలా వరకు తెలంగాణ మోడల్ స్కూళ్ల పేర్లు రాకపోవడంతో ఆదాయం, కులం సర్టిఫికెట్లను ఆయా మండల తహసీల్దార్ల నుంచి తీసుకుని ఆన్లైన్ సెంటర్ల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. మోడల్ స్కూల్కు వెళ్లి అడిగితే తమకు సమాచారం లేదని చెప్పుతున్నారు.
ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్ అందేనా?
అర్హులు కాదా?
తెలంగాణ ఈపాస్ ఆన్లైన్లో కనపించని మోడల్ స్కూల్స్లో చదువుతున్న ఎస్సీ విద్యార్థులు స్కాలర్ షిప్లకు దరఖాస్తు చేసేందుకు అర్హులు కారా?, మోడల్ స్కూళ్ల పేర్లు గల్లంతు అయ్యాయా? అధికారుల చేసిన నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారనుందా? అని ఆందోళన చెందుతున్నారు. పేదలకు చేయూతను అందించే స్కాలర్ షిప్ అందకుండా పోతుందా? అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఎస్సీ వెల్ఫేర్ అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. దీనిపై సిద్దిపేట ఎస్సీ వెల్ఫేర్ ఇన్చార్జి అధికారి హమీద్ను ఫోన్లో సంప్రదించగా ఈ విషయం హైదరాబాద్లోని ఉన్నత అధికారులకు సమాచారం అందించామని, రెండు రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు.


