చలి ప్రభావంతో ఎదుగుదల లేని వరి
● యాజమాన్య పద్ధతులు పాటిస్తేనే మేలు
● వ్యవసాయ అధికారి శ్రీనాథ్
సిద్దిపేటఅర్బన్: ముందస్తుగా నాటు వేసిన లోతట్టు ప్రాంతాల వరి పైర్లలో చలి ప్రభావం అధికంగా ఉండడంతో ఎదుగుదల కుంటుపడింది. దీంతో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే వరి పైరు తిరిగి మెరుగవుతుందని సిద్దిపేట అర్బన్ మండల వ్యవసాయ అధికారం శ్రీనాథ్ అన్నారు. బుధవారం సిద్దిపేట అర్బన్ మండలంతో పాటు రంగధాంపల్లిలో వరి పైరులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏఓ మాట్లాడుతూ వరిలో నాచు సమస్య అధికంగా ఉన్న వారు పొలంలో నీరు తొలగించి ఆరబెట్టుకోవడంతో నాచు సమస్య తగ్గుతుందన్నారు. పొలంలో కలుపు తీయించడం వల్ల వేరు వ్యవస్థకు గాలి, వెలుతురు ప్రసరించి పోషకాలను స్వీకరించే సామర్థ్యం పెరిగి పైరు వృద్ధి చెందుతుందని తెలిపారు. వరి ఎదగకపోతే 300 గ్రాముల మాంకోజెబ్, కార్బండిజం మిశ్రమాన్ని పిచికారీ చేసుకోవడం వల్ల వేరు వ్యవస్థ గట్టిపడి పైరు బాగా పెరుగుతుందని అన్నారు. వరిలో కాండం తొలిచే పురుగు ఉధృతి అధికంగా ఉందని, అలాగే తేలికపాటి నేలల్లో జింక్ లోపం గమనించినట్లు తెలిపారు. నివారణ కోసం క్లోరాంథ్రానిలిప్రోల్ 60ఎంఎల్ తో పాటు 200 ఎంఎల్ జెనెట్రా లేదా 400 గ్రాముల కార్టప్ హైడ్రోక్లోరైడ్ ద్రావణాన్ని ఎకరానికి 8 నుంచి 10 పంపులకు కలుపుకొని పిచికారీ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈఓ పవన్, రైతులు పాల్గొన్నారు.


