పురపోరు.. ప్రచార హోరు
256 వార్డులు... 1,045 అభ్యర్థులు
● స్వతంత్రులకు గుర్తుల కేటాయింపు ● గెలుపే లక్ష్యంగా ప్రచార కార్యక్రమాలు
సంగారెడ్డి జోన్: మున్సిపల్ ఎన్నికల్లో ప్రధానమైన నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ ఘట్టాలు ముగియడంతో జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఇక ప్రచార పర్వం జోరందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్ర అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఓటర్లను కలవడంతోపాటు ప్రచారానికి సామాజిక మాధ్యమాలను సైతం విస్తృతంగా వినియోగించుకుంటున్నారు.
804 పార్టీ..
241 మంది స్వతంత్ర అభ్యర్థులు
జిల్లాలో 11 మున్సిపాలిటీల పరిధిలో 256 వార్డులున్నాయి. ఆయా మున్సిపాలిటీలలో ప్రస్తుతం కౌన్సిలర్ల పదవికి ఎన్నికలు జరుగుతున్నాయి. 2,293 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా 1,490 ఆమోదించారు. మంగళవారం వరకు 445 మంది పోటీ నుంచి తప్పుకోగా 1,045 మంది పోటీలో ఉన్నారు. ప్రధాన పార్టీలతోపాటు స్వతంత్ర అభ్యర్థులు పోరులో ఉన్నారు. 804 మంది గుర్తింపు పొందిన పార్టీ, 241 మంది అభ్యర్థులు స్వతంత్రులుగా బరిలో ఉన్నారు. బీ ఫారాలు సమర్పించిన అభ్యర్థులకు పార్టీ గుర్తులు కేటాయించగా స్వతంత్రులుగా పోటీ చేస్తున్న వారికి ఎన్నికల సంఘం వివిధ రకాల గుర్తులు కేటాయించింది.
స్థానిక సమస్యలే ఎజెండా
పురపోరులో భాగంగా అభ్యర్థులు స్థానిక సమస్యలు ఎజెండాగా మార్చుకుని, వాటి పరిష్కారానికి హామీలు ఇస్తూ ప్రచారం కొనసాగిస్తున్నారు. క్షేత్రస్థాయికి వెళ్లి తమనే గెలిపించాలని ఓటర్లను కలిసి విజ్ఞప్తి చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా మద్దతుదారులతో కలిసి పట్టణంలోని గల్లీలు చుట్టేస్తున్నారు. వీటితోపాటు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. తమను గెలిపిస్తే అభివృద్ధి చేసే కార్యక్రమాలను ఓటర్ల దృష్టికి తీసుకు వెళ్తున్నారు. వాట్సాప్, ఇన్స్ట్రాగామ్, ఫేస్బుక్లలో తమ గుర్తులతోపాటు హామీలను చేరవేస్తున్నారు. మరి కొంతమంది రీల్స్ చేస్తూ దగ్గరవుతున్నారు. వారం రోజులపాటు పట్టణంలోని గల్లీలో ప్రచారాలతో హోరెత్తుతాయి.
బరిలో నిలిచిన అభ్యర్థులు
మున్సిపాలిటీ వార్డులు అభ్యర్థులు
అందోల్–జోగిపేట 20 63
గడ్డపోతారం 18 72
గుమ్మడిదల 22 94
ఇంద్రేశం 18 76
జిన్నారం 26 101
కోహీర్ 16 59
ఖేడ్ 15 57
సదాశివపేట 26 99
సంగారెడ్డి 38 176
జహీరాబాద్ 37 174


