
వానరానికి అంత్యక్రియలు
కడ్తాల్: మండల పరిధిలోని రావిచేడ్లో కొన్నేళ్లుగా నిత్యం జనం మధ్య కలివిడిగా తిరుగుతూ, వారు పెట్టే పండ్లు, ఆహారం తింటూ జీవిస్తున్న ఓ వానరం మంగళవారం స్థానిక హనుమాన్ దేవాలయంలో మృతి చెంది కనిపించింది. గమనించిన ఆలయ నిర్వాహకులు విషయాన్ని స్థానిక శ్రీ సీతారామంజనేయ స్వామి భజన మండలి సభ్యులకు తెలిపారు. వారు గ్రామస్తులతో సమావేశమై వానరాన్ని ఆంజనేయుడికి ప్రతి రూపంగా భావించి అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. వానర కళేబరాన్ని ట్రాక్టర్పై ఉంచి బ్యాండ్ మేళాలు, భజన పాటలతో ఊరేగింపుగా వెళ్లి స్థానిక శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు. నిత్యం గ్రామస్తుల మధ్య కలియ తిరిగే వానరం మృతితో పలువురు కంటతడి పెట్టుకున్నారు.
పట్టణ పరిధిలో ఉపాధి పనులు చేపట్టాలి
మొయినాబాద్రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో అమలవుతున్న ఎన్ఆర్ఈజీఎస్ (ఉపాధి హామీ పథకం)ను పట్టణాల్లోనూ అమలు చేయాలని భారత కిసాన్ మజ్దూర్ యూనియన్ (బీకేఎంయూ) రాష్ట్ర అధ్యక్షుడు కలకొండ కాంతయ్య అన్నారు. మండల పరిధిలోని సజ్జనపల్లి గ్రామ సమీపంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో మంగళవారం సంఘం జిల్లా సమితి సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కలకొండ కాంతయ్య మాట్లాడుతూ.. ఎన్నో పోరాటాలతో 2005లో అప్పటి యూపీఏ ప్రభుత్వ హయాంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టరూపం దాల్చిందని తెలిపారు. మోదీ ప్రభుత్వం వచ్చిన తరువాత నిధులు తగ్గించి రోజురోజుకూ నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. ఇకనైనా అలాంటి పనులు మానుకోవాలని హితవు పలికారు. ఈ పథకాన్ని 200 రోజులకు పెంచాలని, రోజు కూలీ కొలతలతో సంబంధం లేకుండా కనీసం రూ.700 ఇవ్వాలని, కూలీలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్దుల జంగయ్య, సీపీఐ మండల కార్యదర్శి శ్రీనివాస్, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎస్.లక్ష్మయ్య, జిల్లా కోశాధికారి ఎం.కృష్ణ, కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుకి రూ.లక్ష చెక్కు అందజేత
కడ్తాల్: మండల పరిధిలోని కొండ్రిగాని బోడ్తండాకు చెందిన బాణవత్ మస్రూ ఇందిరమ్మ ఇంటికి సంబంధించిన తొలివిడత రూ.లక్ష చెక్కును అందుకుంది. హైదరాబాద్లోని నోవాటెల్ హోటల్లో మంగళవారం సీఎం రేవంత్రెడ్డి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పలువురు లబ్ధిదారులకు రూ.లక్ష చొప్పున తొలి విడత చెక్కులు పంపిణీ చేశారు. ఇదే కార్యక్రమంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో బాణవత్ మస్రూకు కూడా చెక్కును అందజేశారు.
కప్పపహాడ్ లబ్ధిదారుకు చెక్కు..
ఇబ్రహీంపట్నం రూరల్: మండల పరిధిలోని కప్పపహాడ్కు చెందిన ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు చెరువెంక అశ్వినీ దంపతులు మంగళవారం సీఎం రేవంత్రెడ్డి, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి చేతుల మీదుగా లక్ష రూపాయల చెక్కు అందుకున్నారు. శంషాబాద్లోని నోవాటెల్ హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.
వానరానికి అంతిమయాత్ర నిర్వహిస్తున్న గ్రామస్తులు

వానరానికి అంత్యక్రియలు

వానరానికి అంత్యక్రియలు