సీపీఎం పోరాట ఫలితమే రైతులకు ఇళ్ల స్థలాలు
పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ
తుక్కుగూడ: సీపీఎం పోరాట ఫలితంగానే ఫ్యాబ్ సిటీ నిర్వాసితులకు ఇళ్ల స్థలాలు అందాయని పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ అన్నారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం రావిర్యాల, జెన్నాయిగూడ రైతులు ఆయన్ను కలిసారు. ఈ సందర్భంగా జాన్వెస్లీ మాట్లాడుతూ.. 2004లో జెన్నాయిగూడలో ఫ్యాబ్సిటీ ఏర్పాటుకు 224 మంది రైతుల నుంచి 827 ఎకరాల భూమిని సేకరించారని.. తదనంతరం వారిని పట్టించుకోలేదన్నారు. దీంతో పార్టీ జిల్లా కమిటీ రైతుల పక్షాన పోరాడిందని గుర్తు చేశారు. దీంతో ప్రభుత్వం రైతులకు ఇళ్ల స్థలాలు కేటాయించి నలుగురికి రిజిస్ట్రేషన్ చేసిందన్నారు. మిగిలిన నిర్వాసితులకు సైతం అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు డి.రామ చందర్,ఆర్.స్వామి, రైతులు నర్సింహ, ప్రశాంత్, నాగేశ్, భిక్షపతి, రాజు, అశోక్ పాల్గొన్నారు.
కూలీల పొట్టకొట్టేందుకు
కేంద్రం కుట్ర
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా
అధ్యక్షుడు అంజయ్య
యాచారం: కూలీల పొట్ట కొట్టేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలుపన్నుతోందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పి.అంజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధ వారం సంఘం ఆధ్వర్యంలో నందివనపర్తి, నస్దిక్సింగారం, కుర్మిద్ద గ్రామాల్లో భోగి మంటల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వీబీ జీ రామ్ జీ జీఓ ప్రతులను వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అంజయ్య మాట్లాడు తూ.. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు బీజేపీ ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీరు మార్చుకో కుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు జంగయ్య, సురేశ్, బుగ్గ రాములు, గోపాల్, రాములు, లక్ష్మయ్య పాల్గొన్నారు.
బకాయిలు సకాలంలో
చెల్లించండి
డీసీసీబీ డీజీఎం శైలాజారెడ్డి
యాచారం: పీఏసీఎస్లో పొందిన రుణాలకు సకాలంలో బకాయిలను చెల్లించాలని డీసీసీబీ డీజీఎం శైలజారెడ్డి రైతులకు సూచించారు. యాచారం పీఏసీఎస్ పరిధిలోని యాచారం, తమ్మలోనిగూడ, మాల్ గ్రామాల్లో బకాయిలున్న రైతులను ఆమె బుధవారం కలిశారు. పీఏసీఎస్లో పౌల్ట్రీఫాం, డెయిరీఫాం, గొర్రెలు, మేకల పెంపకం కోసం తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించాలన్నారు. యాచారం పీఏసీఎస్ కింద రూ.48 కోట్ల బకాయిలున్నట్లు ప్రతీ రైతు సకాలంలో చెల్లించే విధంగా కృషి చేయాలని ఆమె కోరారు. కొందరు రైతులు అధికారులకు బకాయి చెల్లించారు. మిగిలిన రైతులకు నోటీసులు అందజేశారు. ఈ కార్యక్రమంలో యాచారం పీఏసీఎస్ సీఈఓ నాగరాజు, యాచారం డీసీసీబీ బ్యాంకు మేనేజర్ నాగలక్ష్మి ఉన్నారు.
మున్సిపాలిటీలకురిజర్వేషన్లు ఖరారు
పరిగి: రంగారెడ్డి జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలకు రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లను బుధవారం ఖరారు చేసింది. ఆమనగల్లులో 15 వార్డులు ఉండగా ఎస్టీ– 4, ఎస్సీ– 2, బీసీ– 1, జనరల్– 8, ఇబ్రహీంపట్నంలో 24 వార్డులు ఉండగా ఎస్టీ– 1, ఎస్సీ– 6, బీసీ– 5, జనరల్– 12, కొత్తూర్లో 12 వార్డులు ఉండగా ఎస్టీ– 1, ఎస్సీ– 2, బీసీ– 3, జనరల్– 6, మొయినాబాద్లో 26 వార్డులు ఉండగా ఎస్టీ– 1, ఎస్సీ– 7, బీసీ– 5, జనరల్– 13, షాద్నగర్లో 28 వార్డులు ఉండగా ఎస్టీ– 1, ఎస్సీ– 2, బీసీ– 11, జనరల్– 14, శంకర్పల్లిలో 15 వార్డులు ఉండగా ఎస్టీ– 1, ఎస్సీ– 3, బీసీ– 3, జనరల్– 6 రిజర్వేషన్లను ప్రభుత్వం ప్రకటించింది. ఏ వార్డు ఏ రిజర్వేషన్లో ఉందనే విషయం త్వరలోనే ప్రభుత్వం ప్రకటించనుంది.
సీపీఎం పోరాట ఫలితమే రైతులకు ఇళ్ల స్థలాలు


