
కాంగ్రెస్ పాలనతో జనం విసిగిపోయారు
కందుకూరు: రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. మండల పరిధిలోని సార్లరావులపల్లిలో ఆదివారం మాజీ ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్రెడ్డి, జైపాల్యాదవ్, ఎమ్మెల్సీ బండ ప్రకాష్తో కలిసి నూతనంగా నిర్మించిన శ్రీపెద్దమ్మ తల్లి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి విధివిధానాలు లేకుండా సీఎం రేవంత్రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్ హయాంలో ఫార్మాసిటీ కోసం 14 వేల ఎకరాలు సేకరించారని, ఆ భూముల్లోనే సీఎం రేవంత్రెడ్డి ఫ్యూచర్సిటీ, ఫోర్త్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారన్నారు. అందులో ఎలాంటి పనులు చేపట్టకుండానే అదనంగా భూసేకరణ చేయడం ఏమిటని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలోనే ఫార్మాసిటీలోకి నేరుగా చేరుకునేలా కొత్తూరు గేట్ నుంచి 200 అడుగుల విస్తీర్ణంతో రహదారిని నిర్మించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీన్ఫీల్డ్ రహదారి పేరుతో ఈ ప్రాంతంలోని విలువైన భూములను అమ్ముకోవడానికి చూస్తోందని ఆరోపించారు. ఫ్యూచర్ సిటీ పేరుతో గ్రామాలను విడదీస్తూ ప్రజలను గందరగోళంలోకి నెట్టారన్నారు. ఈ నెల 27న వరంగల్లో నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేసేలా శ్రేణులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్రెడ్డి, జైపాల్యాదవ్ మాట్లాడుతూ.. కేంద్రం నిర్మిస్తున్న త్రిబుల్ఆర్ రోడ్డు తూర్పు భాగంలో కేసీఆర్ హయాంలో రాజకీయాలకు అతీతంగా భూసేకరణ చేశారన్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్రెడ్డి తన సొంత ప్రయోజనాల కోసం రోడ్డును మరింత దూరం పెంచుతూ పోతున్నారని విమర్శించారు. రావిర్యాల ఓఆర్ఆర్ ఎగ్జిట్ 13 నుంచి నిర్మించతలపెట్టిన 330 అడుగుల ఫ్యూచర్సిటీ గ్రీన్ ఫీల్డ్ రహదారిని విరమించుకోవాలన్నారు. వారి వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మన్నే జయేందర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎస్.సురేందర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ డి.చంద్రశేఖర్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు దశరథనాయక్, మాజీ సర్పంచ్ రజితప్రవీణ్నాయక్, ఎంపీటీసీ మాజీ సభ్యులు ఇందిర, సురేష్, పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.మేఘనాథ్రెడ్డి తదితరులు ఉన్నారు.
ఎమ్మెల్యే సబితారెడ్డి