జిల్లాలో పలుచోట్ల డీజిల్ కొరత పెట్రోల్ బంకులకు సరఫరా తగ్గించిన ఆయిల్ కంపెనీలు మూడు రోజులకు ఒక లోడు కూడా గగనం డీజిల్ కొరతతో మూతపడనున్న పెట్రోల్ బంకులు రబీ కోతలు ముమ్మరంగా సాగుతున్న వేళ ఇంధన కొరత ఏరియేటర్ల నిర్వహణకు డీజిల్ దొరక్క రొయ్యలు, చేపల సాగుపై ప్రభావం
డీజిల్
ఒంగోలు సబర్బన్: జిల్లాలో పలు చోట్ల డీజిల్ కొరత ఏర్పడుతోంది. ఆయిల్ కంపెనీలు పెట్రోలు బంకులకు సరఫరా తగ్గించటమే అందుకు కారణంగా తెలుస్తోంది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఈ పరిస్థితులు నెలకొంటున్నాయి. దాంతో జిల్లాలో మూడు రోజులకు ఒక లోడు డీజిల్.. పెట్రోలు బంకులకు సరఫరా చేస్తున్నారు. అదికూడా డబ్బులు కట్టిన మూడు రోజులకు ఆయిల్ కంపెనీలు సరఫరా చేస్తున్నాయి. దాంతో గతంలో మాదిరిగా వందల, వేల లీటర్ల డీజిల్ కావాలంటే ఇచ్చే పరిస్థితుల్లో పెట్రోలు బంకులు లేవు. గతంలో మాదిరిగా ఆయిల్ కంపెనీలకు కూడా పైనుంచి సరఫరా సక్రమంగా రాకపోవటంతో పెట్రోలు బంకులకు సరఫరా కట్టడి చేశాయి. డీజిల్ తగ్గించి పెట్రోలు కావాలంటే తీసుకోవాలని ఆయిల్ కంపెనీల అధికారులు పెట్రోలు బంకు యజమానులకు చెబుతున్నట్లు సమాచారం. దాంతో డీజిల్ కొరత ఏర్పడి బంకులు మూతపడే పరిస్థితి నెలకొంది. ఒక పక్క రబీలో వరి కోతలు ఊపందుకున్నాయి. దాంతో ఇంధన కొరతతో వరికోత మిషన్లు జిల్లాలో కనపడటం లేదు. ఎక్కడి వరికోత మిషన్లు అక్కడే ఆగిపోయాయి. డీజిల్ కొరతతో ఆక్వా రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఏరియేటర్ల నిర్వహణకు డీజిల్ దొరక్క రొయ్యలు, చేపలసాగుపై ప్రభావం చూపే పరిస్థితి. దానికి తోడు కరెంటు కోతలు మొదలైతే అన్నిరంగాలపై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని పెట్రోలు బంకు యజమానులు జేసీని కలిసి డీజిల్ కొరతపై చర్చించేందుకు ప్రయత్నిస్తున్నారు.


