అమెరికాతో చర్చలు.. ఇరాన్‌ కొత్త ట్విస్ట్‌! | Tehran says No Iran-US talks planned | Sakshi
Sakshi News home page

అమెరికాతో చర్చలు.. ఇరాన్‌ కొత్త ట్విస్ట్‌!

Apr 25 2026 7:53 AM | Updated on Apr 25 2026 8:59 AM

Tehran says No Iran-US talks planned

ఇస్లామాబాద్‌: అమెరికా, ఇరాన్‌ మధ్య రెండో విడత చర్చలకు రంగం సిద్ధమైంది. పాకిస్తాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో మరోసారి చర్చలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ కొత్త ట్విస్ట్‌ ఇచ్చారు. అమెరికాను దురాక్రమణదారుగా అభివర్ణిస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇదే సమయంలో అమెరికాతో నేరుగా చర్చలు జరిపే ప్రసక్తే లేదన్నారు. దీంతో, చర్చల విషయమై పాకిస్తాన్‌కు టెన్షన్‌ నెలకొంది. 

ఇస్లామాబాద్​ వేదికగా మరికొన్ని గంటల్లో అమెరికా, ఇరాన్ మధ్య రెండో విడత చర్చలు జరగనున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్‌కు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం రాగా, అమెరికా నుంచి ప్రత్యేక రాయబారులు వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇరాన్ కీలక ప్రకటన చేసింది. అరాగ్చీ బృందం ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ.. అమెరికాతో ఎలాంటి చర్చలు జరగబోవని స్పష్టంచేసింది. ప్రాంతీయ శాంతి ప్రయత్నాల మధ్య ఈ పర్యటన కొనసాగుతున్నప్పటికీ, అమెరికా-ఇరాన్ ప్రత్యక్ష చర్చలకు అవకాశం లేదని తెలిపింది. తమ అభిప్రాయాలను పాకిస్తాన్‌ అధికారులకు మాత్రమే వివరిస్తామని తెలిపింది. దీంతో, చర్చలపై మరోసారి సందిగ్ధం నెలకొంది.

మరోవైపు.. అమెరికా, ఇరాన్‌ చర్చల నేపథ్యంలో ఇస్లామాబాద్‌లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.  కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 10వేల మంది భద్రతాసిబ్బంది పహారా కాస్తున్నారు. రెడ్ జోన్‌ను పూర్తిగా మూసివేసి, కార్యాలయ ఉద్యోగులకు 'వర్క్ ఫ్రమ్ హోమ్' సౌకర్యం కల్పించారు. ఏప్రిల్ 11, 12 తేదీల్లో జరిగిన మొదటి రౌండ్ చర్చలు విఫలం కావడంతో ఈ రెండో రౌండ్ అత్యంత కీలకంగా మారింది. కాగా, ఈ చర్చల కోసం అమెరికాకు చెందిన లాజిస్టిక్స్, భద్రతా బృందం ఇప్పటికే పాకిస్తాన్‌కు చేరుకుందని పాక్ ప్రభుత్వ వర్గాలు నిర్ధారించాయి. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్‌ విట్కాఫ్, ట్రంప్‌ అల్లుడు జారెడ్‌ కుష్నర్‌ ఇరాన్‌తో చర్చల కోసం పాక్‌కు వెళ్లనున్నారు. ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీతో వారు భేటీ కానున్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ వీరితో కలిసి వెళ్లడం లేదు. చర్చల్లో పురోగతి సాధిస్తే ఆయన పాకిస్తాన్‌కు వెళ్లే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్పారు.

 

Advertisement
 
Advertisement
Advertisement