దళితుల వ్యతిరేక ప్రభుత్వం ఇది..
రెడ్బుక్ రాజ్యాంగం అమలులో భాగమే సాల్మన్ హత్య దళితులకు జీవించే హక్కు లేదా..? దళితుల సంక్షేమాన్ని అటకెక్కించిన చంద్రబాబు ప్రభుత్వం ఎస్సీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు
ఒంగోలు సిటీ: చంద్రబాబు ప్రభుత్వం దళితుల వ్యతిరేక ప్రభుత్వమని, దళితుల సంక్షేమాన్ని అటకెక్కించి వారిపై దాడులను ప్రోత్సహిస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు మాదిగ ఆరోపించారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఒంగోలులో అంబేడ్కర్ భవనం నుంచి ప్రకాశం భవనం వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, బాబు జగ్జీవన్రావు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమానికి ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు జి.దేవప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు మాట్లాడుతూ గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో టీడీపీ ఉన్మాదుల దాడిలో చనిపోయిన మందా సాల్మన్ హత్యను ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో నిరసన తెలుపుతున్నామన్నారు. 18 నెలలుగా టీడీపీ నేతల వేధింపులకు తట్టుకోలేక గ్రామంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మెనార్టీలకు చెందిన 300 కుటుంబాలు గ్రామం వదిలి బయట ప్రాంతాల్లో తల దాచుకుంటున్నారని విమర్శించారు. 18 నెలలు గ్రామం విడిచి వెళ్లిన సాల్మన్ భార్య అనారోగ్యంతో ఉందని తెలిసి పరామర్శ కోసం గ్రామానికి వస్తే అతనిపై టీడీపీ నాయకులు దొంగచాటుగా, కిరాతకంగా, విచక్షణారహితంగా దాడిచేసి హత్య చేశారని ఆరోపించారు. ఈ ప్రాంతంలో వైఎస్సార్ సీపీ వారు ఉండకూడదనే వివక్షతో ఈ గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలను భయకంపితులుగా చేస్తున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలు:
దళితుల మీద దాడులు, అత్యాచారాలు జరుగుతుంటే సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. రెడ్బుక్ రాజ్యాంగం అమలులో భాగమే ఈ హత్య అని ఆయన ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తున్న రెడ్బుక్ రాజ్యాంగంలో దళితులు ఉండకూడదా, నివసించకూడదా అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం వచ్చాక టీడీపీ నేతల ఆగడాలకు ముగ్గురు దళితులు ప్రాణాలు పోయాయన్నారు. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో గోవిందమ్మను ట్రాక్టర్లతో ఢీకొట్టి హత్య చేశారన్నారు. అద్దంకి నియోజకవర్గం బల్లికురవలో దళిత రైతు చింతల శ్రీను భూమిని కాజేసేందుకు టీడీపీ నాయకులు యత్నించారన్నారు. అతను రక్షణ కల్పించాలని ఉన్నతాధికారులకు మొర పెట్టుకున్నాడని ఫలితం కనిపించకపోవడంతో మంత్రి గొట్టిపాటి రవి దృష్టికి సైతం తీసుకెళ్లాడన్నారు. అక్కడ కూడా న్యాయం లభించకపోవడంతో గత్యంతరం లేక ఆత్మహత్య చేసుకున్నాడని వాపోయారు. మందా సాల్మన్ను టీడీపీ నాయకులు కిరాతకంగా దాడి చేసి హత్య చేశారన్నారు. దళితులపై దాడులు జరుగుతుంటే చంద్రబాబు స్పందించకపోవడం దారుణమన్నారు. హత్యాంధ్రప్రదేశ్గా మార్చుతున్న చంద్రబాబు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అవకాశం కోల్పోయారన్నారు. ఈ ప్రభుత్వానికి పతనం తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్తులన్నింటినీ ధారదత్తం చేస్తోందని, మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ, ప్రశ్నించిన వారిని వేధింపులకు గురి చేస్తున్నారని విమర్శించారు. మందా సాల్మన్ కుటుంబానికి కోటి రూపాయిలు నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న మాట్లాడుతూ చంద్రబాబు పరిపాలనలో రాష్ట్రంలో పూర్తిగా శాంతిభద్రతలు క్షీణించాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు దేవప్రసాద్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు తమ ఇస్టానుసారంగా దౌర్జన్యాలు చేస్తూ హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు.
కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొట్ల రామారావు, రాష్ట్ర రైతు విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ వైఎం.ప్రసాద్రెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు బొట్ల రామారావు, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పల్నాటి రవీంద్రారెడ్డి, గౌడ విభాగం జిల్లా అధ్యక్షులు తాతా నరసింహాగౌడ్, సంతనూతలపాడు మండల అధ్యక్షుడు దుంపా చెంచిరెడ్డి, దుంపా యలమందారెడ్డి, మహిళా నాయకులు బడుగు ఇందిరా, బత్తుల ప్రమీల, దేవరపల్లి రమణయ్య, ఎస్సీ సెల్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ దుడ్డు వినోద్ కుమార్, ఎస్సీ సెల్ టౌన్ ప్రెసిడెంట్ పసుపర్తి గోపిచంద్, నాయకులు ఉన్నం జనార్ధన్, డానియేల్, కిరణ్కుమార్, మేళం గురవయ్య, టి.కరుణాకర్, ప్రతాప్, వీసం బాలకృష్ణ, పీటర్, యోహాను, జాన్సీ, కొమ్ము శామ్యూల్, వెంకయ్య నాయుడు, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు షేక్ సుల్తాన్భాషా, సింగరాయకొండ మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ అల్లాభక్షు, సింగరాయకొండ మండల ప్రధాన కార్యదర్శి సయ్యద్ అబిద్అలీ, జిల్లా పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ మెంబరు షేక్ కరీముల్లా, వైఎస్సార్సీపీ నాయకులు షేక్ ఇంతియాజ్, కొండపి ఎస్సీ సెల్ అధ్యక్షులు కిరణ్కుమార్, జిల్లా ఎస్సీ సెల్ కమిటీ కార్యదర్శి కంభంపాటి సన్నిబాబు, దర్శి నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు గల్లెపోగు ఏసుదాసు, ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవదానం, రాష్ట్ర క్రిస్టియన్ సెల్ కార్యదర్శి గుంటు పోలయ్య, జిల్లా ఎస్సీ నాయకులు పి.డగ్లస్, కొడవటి జాన్, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి కందుల డానియల్, ఎస్సీ సెల్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


