విద్యుదాఘాతానికి రైతు మృతి
● త్రిపురాంతకం మండలం
వెల్లంపల్లి వద్ద వరి పొలంలో ఘటన
త్రిపురాంతకం: పంట పొలం వద్ద విద్యుత్ షాక్కు గురై రైతు మృతిచెందిన సంఘటన శుక్రవారం జరిగింది. త్రిపురాంతకం మండలం వెల్లంపల్లి సమీపంలోని వరి పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన దూదేకుల చాంద్ బాషా (55) విద్యుత్ షాక్కు గురయ్యాడు. బోరు వద్ద విద్యుత్ వైర్లు తగిలి విద్యుదాఘాతానికి గురైనట్లు గ్రామస్తులు తెలిపారు. చాంద్ బాషాకు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. ముగ్గురు పిల్లలకు వివాహమైంది. ఎస్ఐ శివబసవరాజు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కొత్తపట్నం: కారు ఢీకొని ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన మండలంలోని అల్లూరు గ్రామంలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కొండపి మండలం మూగచింతల గ్రామానికి చెందిన తొట్టింపూడి కోటేశ్వరరావు (35) ప్రైవేటు బస్సు డ్రైవర్గా పనిచేస్తుంటాడు. ప్రస్తుతం కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామంలోని బంధువుల ఇంటికి వచ్చాడు. గురువారం సాయంత్రం అల్లూరు గ్రామంలో నడుచుకుంటూ వెళ్తుండగా, హెచ్పీ పెట్రోలు బంకు వద్ద కొత్తపట్నం వైపు నుంచి వచ్చిన గుర్తుతెలియని కారు కోటేశ్వరరావును ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నాలుగు నెలల క్రితం బైక్ మీద వెళుతుంటే ఒంగోలులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తలకు బలమైన గాయం తగిలి ఆపరేషన్ చేయించారు. కొంతకాలం కుటుంబానికి దూరంగా ఉండాలని పెద్దలు చెప్పడంతో అల్లూరు గ్రామంలోని బంధువుల ఇంటికి వచ్చాడు. తలకు గాయం మాని ఆరోగ్యం మెరుగుపడటానికి ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వాకింగ్ చేస్తున్నాడు. అందులో భాగంగా గురువారం సాయంత్రం వాకింగ్కు వెళుతున్న సమయంలో కారు ఢీకొని మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న ఎస్సై వేముల సుధాకర్బాబు సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు జీజీహెచ్కి మృతదేహాన్ని తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు.
పుల్లలచెరువు: సెలవులకు సరదాగా సొంత గ్రామానికి వచ్చిన విద్యార్థి కాలువలో పడి మృతిచెందిన సంఘటన మండలంలోని ఐటీ వరం గ్రామంలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మారాసు బలరామ్ (21) గురువారం సాయంత్రం బహిర్భూమికి వెళ్లి కాలువ వద్ద శుభ్రం చేసుకునే క్రమంలో ప్రమాదవశాత్తూ నీటిలో పడి చనిపోయాడు. శుక్రవారం ఉదయం కాలువలో బలరామ్ శవం బయటపడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తండ్రి వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సంతప్కుమార్ చెప్పారు. బలరామ్ బీటెక్ చదువుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఉలవపాడు: మండల కేంద్రమైన ఉలవపాడులోని ఏఎంఆర్ సెల్ షాపులో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. స్థానిక కొత్త రైల్వేస్టేషన్ రోడ్డులోని షాపులో గురువారం తెల్లవారుజామున చోరీ జరిగినట్లు షాపు యజమాని బాషా తెలిపారు. షట్టర్ తాళాలు పగలగొట్టి షాపులో రిపేరుకు వచ్చి ఉన్న 10 ఫోన్లు, 5 బ్లూటూత్లు, 2 పవర్ బ్యాంకులతో పాటు చార్జర్లు చోరీ చేసినట్లు తెలిపారు. దీనిపై స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు పరిశీలించి విచారిస్తున్నారు.
విద్యుదాఘాతానికి రైతు మృతి
విద్యుదాఘాతానికి రైతు మృతి


