రక్షకుడే ‘శిక్ష’కుడయ్యాడు | - | Sakshi
Sakshi News home page

రక్షకుడే ‘శిక్ష’కుడయ్యాడు

Jan 17 2026 7:38 AM | Updated on Jan 17 2026 7:38 AM

రక్షకుడే ‘శిక్ష’కుడయ్యాడు

రక్షకుడే ‘శిక్ష’కుడయ్యాడు

చిలకలూరిపేట టౌన్‌: అతనో పోలీస్‌ అధికారి.. రోడ్డు నిబంధనల గురించి అందరికీ అవగాహన కల్పించాల్సిన బాధ్యత గల వ్యక్తి. కానీ, ఆయనే నిద్రమత్తులో వాహనం నడిపి ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నారు. సంక్రాంతి పండుగ పూట చిలకలూరిపేట మార్గంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

అతివేగం.. అదుపు తప్పిన కారు

ప్రకాశం జిల్లా ఉప్పుమాగులూరుకు చెందిన దండా వీరయ్య (63) వృత్తిరీత్యా పాల వ్యాపారి. ఎప్పటిలాగే పండుగ రోజు ఉదయం తన బైక్‌పై పాల క్యాన్లతో చిలకలూరిపేటకు బయలుదేరారు. సరిగ్గా ఉదయం 7:30 గంటల సమయంలో పోతవరం విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ సమీపంలోకి రాగానే, అదేమార్గంలో వెనుకగా అతివేగంతో వస్తున్న ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం స్టేషన్‌కు చెందిన ఎస్‌ఐ చౌడయ్య కారు అదుపుతప్పి రెండు బైక్‌లను బలంగా ఢీకొట్టింది.

ఘటనా స్థలిలో భీతావహ దృశ్యం

ఈ ప్రమాద ధాటికి రెండు బైక్‌లతో పాటు కారు ముందుభాగం దెబ్బతిన్నాయి. పాల క్యాన్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడి నేలపాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఎస్‌ఐ చౌడయ్య కిందకు దిగి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసినా తీవ్రంగా గాయపడిన వీరయ్య మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచారు. రెండో బైక్‌పై అదేమార్గంలో ప్రయాణిస్తున్న మద్దిరాల వాసి మస్తాన్‌వలికి తీవ్ర గాయాలయ్యాయి.

నిద్రమత్తే కొంపముంచింది..

రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఈ ప్రమాదానికి కారకులు కావడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. ఎస్‌ఐ నిద్రమత్తులో ఉండటం వల్లే కారుపై నియంత్రణ కోల్పోయారని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మృతుడి కుమారుడు నరేంద్ర ఇచ్చిన ఫిర్యాదుతో రూరల్‌ ఎస్‌ఐ అనిల్‌ కుమార్‌ కేసు నమోదు చేశారు. పండుగ పూట ఇంట్లో వెలుగులు నింపాల్సిన తండ్రి, రోడ్డు ప్రమాదంలో విగతజీవిగా మారడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది.

ఎస్‌ఐ కారు ఢీకొని పాల వ్యాపారి మృతి సంక్రాంతి వేళ కోటప్పకొండ మార్గంలో విషాదం

నిద్రమత్తులో కారు నడిపిన ఎస్‌ఐ రెండు బైక్‌ల ధ్వంసం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement