
వేట నిషేధ భృతి ఎంతో అవసరం
● కలెక్టర్ తమీమ్ అన్సారియా
ఒంగోలు సబర్బన్: చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు భృతి ఎంతో అవసరమని కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అన్నారు. సముద్రంలో చేపల వేట నిషేధ కాలంలో భృతి పంపిణీ కార్యక్రమాన్ని ఒంగోలు కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో శనివారం మత్స్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా పాల్గొని మాట్లాడుతూ ప్రతి ఏటా 2 నెలల పాటు ఉండే చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకార కుటుంబాల జీవనం కోసం ఇచ్చే భృతిని రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచినట్లు తెలిపారు. మెగా చెక్కును మత్స్యకారులకు అందజేశారు. ఈ పథకం ద్వారా జిల్లాలో 2025–26 సంవత్సరానికిగానూ 5,501 మంది సముద్ర మత్స్యకారులకు ఒక్కో కుటుంబానికి ఇరవై వేల రూపాయల చొప్పున మొత్తం పదకొండు కోట్ల ఇరవై వేల రూపాయల లబ్ధి చేకూరనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలోని కొత్తపట్నం, ఒంగోలు, టంగుటూరు, సింగరాయకొండ, నాగులుప్పలపాడు మండలాలకు చెందిన మత్స్యకారులకు ఈ భృతిని అందజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, జిల్లా మత్స్యకార సొసైటీ అధ్యక్షుడు పేరయ్య, మత్స్యకార సంఘాల ప్రతినిధులు తిరుపతిరావు, సున్నం తిరుపతి, రాయం శ్రీనివాసరావు, వివిధ మత్స్య కార సంఘాల ప్రతినిధులు, మత్స్యకారులు పాల్గొన్నారు.