అక్రమ కేసులు ఎత్తేయాలని జర్నలిస్టుల నిరసన
● సబ్కలెక్టర్కు వినతిపత్రం
మార్కాపురం: రాష్ట్ర ప్రభుత్వం ‘సాక్షి’ దినపత్రికపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ ‘సాక్షి’ ఎడిటర్ ఆర్ ధనుంజయరెడ్డితోపాటు మరో ఆరుగురు సాక్షి రిపోర్టర్లపై బనాయించిన అక్రమ కేసులను ఎత్తివేయాలని పాత్రికేయులు డిమాండ్ చేశారు. చంద్రబాబు రెడ్బుక్ అరాచకాలను వెలుగులోకి తెస్తున్న సాక్షి పత్రికపై వ్యవహరిస్తున్న కక్షపూరిత విధానాలను విడిచిపెట్టాలన్నారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని పశువేములకు చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త హరిశ్చంద్రను టీడీపీ వర్గీయులు హత్యచేసిన విషయాన్ని సాక్షిలో ప్రచురించినందుకు కూటమి ప్రభుత్వం కక్ష కట్టి సాక్షి ఎడిటర్తోపాటు మరో ఆరుగురిపై నమోదు చేసిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని మార్కాపురం ప్రెస్క్లబ్ గౌరవ అధ్యక్షుడు ఓఏ మల్లిక్, ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు ఎన్వీ రమణ డిమాండ్ చేశారు. మార్కాపురం ప్రెస్క్లబ్ నుంచి సబ్కలెక్టర్ కార్యాలయం వరకూ శుక్రవారం నిరసన ప్రదర్శన నిర్వహించి అనంతరం సబ్కలెక్టర్ త్రివినాగ్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా పాత్రికేయుడు ఓఏ మల్లిక్ మాట్లాడుతూ ఒక దారుణాన్ని వెలుగులోకి తెచ్చిన సాక్షి పత్రికపై ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరించడాన్ని ఖండించారు. పత్రికా స్వేచ్ఛను హరించే విధానాలను ప్రభుత్వం విడిచిపెట్టాలన్నారు. ఏదైనా వార్త నచ్చకపోతే ఖండన ఇవ్వవచ్చని, అలా కాకుండా కక్ష పూరితంగా వ్యవహరిస్తూ కేసులు నమోదు చేయడం మంచి సాంప్రదాయం కాదన్నారు. ఈరోజు సాక్షి కావచ్చు... రేపు మరో పత్రికకు కూడా ఇదే పరిస్థితి రావచ్చన్నారు. జర్నలిస్టులందరూ ఐక్యంగా ఉండి ఇలాంటి సంఘటనలను ఎదుర్కోవాలన్నారు. పోరాటాలు చేయాల్సిన అవసరం ఆసన్నమైందని చెప్పారు. పాత్రికేయులు అప్పటికప్పుడు వచ్చిన సమాచారాన్ని వెంటనే ప్రచురిస్తారని, ఇలాంటి వార్తలపై కూడా దారుణంగా ప్రభుత్వం వ్యవహరించడం శోచనీయమన్నారు. ప్రభుత్వం నమోదు చేసిన క్రిమినల్ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఇలా చేస్తే భవిష్యత్తులో పాత్రికేయ వృత్తి ప్రమాదకర పరిస్థితుల్లో పడుతుందని అన్నారు. కార్యక్రమంలో మార్కాపురం ప్రెస్క్లబ్ అధ్యక్షుడు డీ మోహన్రెడ్డి, సాక్షి ప్రతినిధులు జీఎల్ నరసింహారావు, డీ జగన్నాథరెడ్డి, బీ రామయోగి, బీ మల్లిఖార్జున్, ఎలక్ట్రానిక్ మీడియా అసోషియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్కే బాజీవలి, జిల్లా యూనియన్ కార్యవర్గ సభ్యులు ఎస్కె అన్నూ, ఏపీయూడబ్ల్యూజేఎఫ్ నాయకుడు వెన్న శ్రీనివాసరెడ్డి, ఎంపీజే రాష్ట్ర అధ్యక్షుడు ఎస్కే బాబు, ఏపీయూడబ్ల్యూజే నాయకులు ఎస్కే మహబూబ్ సుభానీ, సయ్యద్ షాకీర్ హుస్సేన్, వేశపోగు రాజు, ఆదినారాయణ, మల్లిఖార్జున, నరేంద్ర, అనీల్కుమార్, బషీర్, ఓబయ్య, ఎస్ పోలయ్య, ఎస్కె కరీమ్, ఖలీల్, బూదాల సురేష్కుమార్, కల్లూరి వెంకటేశ్వర్లు, సీహెచ్ సౌకత్, ఇమ్మడి శ్రీనివాసులు, ముకుందర్, ప్రకాష్, పవన్కుమార్, రాజ్కమల్, శేఖర్, వై శ్రీనివాసులు, ఆమ్ఆద్మీపార్టీ జిల్లా కన్వీనరు సుదర్శన్, శ్రీధర సాయికుమార్, ఎస్ఎమ్ సుభానీ, జాన్సన్, పీయల్ నవీన్, టీ మల్లిఖార్జున పాల్గొన్నారు.
అక్రమ కేసులు ఎత్తివేయాలి
రాష్ట్ర ప్రభుత్వం సాక్షి పాత్రికేయులపై నమోదు చేసిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు ఎన్వీ రమణ డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లాలో ‘సాక్షి’లో వచ్చిన వార్తపై పోలీసులు సాక్షి ఎడిటర్ ధనుంజయ్రెడ్డితోపాటు మరో ఆరుగురు సాక్షి రిపోర్టర్లపై పెట్టిన కేసును వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన ప్రభుత్వమే ఇలా చేయడం మంచి సాంప్రదాయం కాదన్నారు. పత్రికల్లో వచ్చిన వార్తలు నచ్చకపోతే ఖండన ఇవ్వవచ్చని, ఇలా కేసులు పెడితే భవిష్యత్తులో పాత్రికేయ వృత్తిలోకి ఎవరైనా రావాలంటే భయపడతారని అన్నారు. ప్రజాస్వామ్యానికి మూల స్తంభమైన పత్రికా స్వేచ్ఛను ప్రభుత్వం గౌరవించాలని రమణ కోరారు.
– ఎన్వి రమణ, ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు
అక్రమ కేసులు ఎత్తేయాలని జర్నలిస్టుల నిరసన


