ఐసీయూలో.. | - | Sakshi
Sakshi News home page

ఐసీయూలో..

Apr 2 2025 12:20 AM | Updated on Apr 2 2025 12:20 AM

ఐసీయూ

ఐసీయూలో..

పేరుకే పెద్దాసుపత్రి.. జిల్లా నలుమూలల నుంచి వందలాది మంది రోగులు ఇక్కడకు వచ్చి వెళ్తుంటారు.. ఎప్పుడు చూసినా రద్దీగా ఉంటుంది. రోడ్డు ప్రమాదాలు, పాయిజన్‌ కేసులు, ఎంల్‌సీ వంటి అత్యవసర కేసులు సైతం పెద్ద ఎత్తున వస్తుంటాయి. ఇక్కడ స్పెషలిస్ట్‌ డాక్టర్ల కొరత వేధిస్తోంది. చిన్న చిన్న కేసులు తప్పించి మిగతా కేసులను గుంటూరుకు తరలించి చేతులు దులుపుకుంటున్నారు. అత్యవసర వైద్య విభాగం ఎక్కడో కనిపించదు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో అత్యవసర వైద్యం ఐసీయూ మంచమెక్కింది.
సర్వజన వైద్యం

ఒంగోలు టౌన్‌: రిమ్స్‌.. వేలాది మంది రోగులకు వైద్య సేవలు అందించే జిల్లా ఆసుపత్రి. వందలాది మంది వైద్య విద్యార్థులను తీర్చిదిద్దే బోధనాసుపత్రి. అయినా ఇక్కడ సూపర్‌ స్పెషాలిటీ సేవలు అందని ద్రాక్షగా మిగిలిపోతున్నాయి. న్యూరాలజిస్టు లేకుండానే సదరం సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. ఒక్కరే కార్డియాలజిస్టు ఉండడంతో ఆయన సెలవు పెడితే వైద్య సేవలు ఆగిపోతున్నాయి. లేజర్‌ చికిత్స లేక కిడ్నీ రోగులు పాట్లు పడుతున్నారు. ఒంగోలు దక్షిణ, ఉత్తర బైపాస్‌ ల మీద తరచుగా ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇక్కడ ట్రామా సెంటర్‌ కనిపించదు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత సమస్యలతో జీజీహెచ్‌ సతమతమవుతోంది. పేరుకు అనేక మంది వైద్యులున్నప్పటికీ వైద్య సేవల విషయంలో పాలకుల కొండంత నిర్లక్ష్యం కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వాస్పత్రిలో వైద్య సేవలు సక్రమంగా అందడం లేదని విమర్శలు వస్తున్నాయి. వైద్య సేవలకంటే రాజకీయాలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో రోగుల పరిస్థితి దయనీయంగా ఉంది. ప్రైవేటు వైద్యశాలలకు వెళ్లి వందల రుపాయల ఓపీ ఫీజులు, వేల రూపాయల రక్త పరీక్షల చేయించే స్థోమత లేని వాళ్లే ఇక్కడకు వైద్య చికిత్స కోసం వస్తుంటారు. ఎంతో ఆశతో ఆస్పత్రికి వచ్చిన రోగులు వైద్యుల నిర్లక్ష్యంతో అవస్థలు పడుతున్నారు. గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుందని వాపోతున్నారు.

న్యూరాలజిస్టు లేకుండానే సదరం సర్టిఫికెట్లు...

ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో సదరంకు వచ్చే వికలాంగుల ఆరోగ్య పరిస్థితిని న్యూరాలజిస్టులు నిర్ధారించాల్సి ఉంటుంది. న్యూరాలజిస్టు లేకుండానే సదరం సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. కాదు కూడదంటే గుంటూరుకు వెళ్లండి. నెల్లూరుకు వెళ్లండని సలహా ఇస్తున్నారు. ఆ మధ్య కందుకూరు నుంచి ఒక రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు అనారోగ్యంతో మాట కోల్పోయారు. ఆయన ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే సదరం సర్టిఫెకెట్‌ జారీ చేశారు. కానీ అధికారులు ఆ సర్టిఫికెట్‌ చెల్లదని తిరస్కరించారు. న్యూరాలజిస్టు మాత్రమే సర్టిఫికెట్‌ ఇవ్వాలని చెప్పారు. దాంతో వారు అవస్థలు పడుతూ గుంటూరు వెళ్లి సదరం సర్టిఫికెట్‌ తీసుకోవాల్సి వచ్చింది. ఇలాంటి ఘటనలు నిత్యం రిమ్స్‌లో దర్శనమిన్తూనే ఉంటాయి. నిరుపేదలు చాలా ఇబ్బందులు పడుతున్నా ఇక్కడ పాలకులకు చీమకుట్టినట్టయినా లేదు. అంతే కాకుండా ఇటీవల పక్షవాతం కేసులు ఎక్కువై పోయాయి. చికిత్స కోసం జీజీహెచ్‌కు వస్తే గుంటూరుకు పంపిస్తున్నారు. నిజానికి పక్షవాతం కేసుల్లో తొలి గంటలోపు చికిత్స చేయాల్సి ఉంటుంది. దాన్ని గోల్డెన్‌ అవర్‌ అంటారు. ఇక్కడ నుంచి గుంటూరు వెళ్లాలంటే కనీసం రెండున్నర గంటల సమయం పడుతుంది. దాంతో గోల్డెన్‌ అవర్‌ సమయం దాటిపోతుంది. ఆ తరువాత ఎంత చికిత్స చేసినా ఫలితం పెద్దగా ఉండదు. దీంతో రోగులు అప్పో సప్పో చేసి ప్రైవేటు వైద్యశాలలకు వెళుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఇద్దరు న్యూరో సర్జన్లు ఉన్నారు. కానీ కనీసం న్యూరో ఫిజీషియన్‌ లేరు. అనేక సంవత్సరాల నుంచి ఈ ఆస్పత్రిలో న్యూరో ఫిజీషియన్‌ పోస్టు ఖాళీగా ఉంది. కొన్నాళ్ల క్రితం ఒక న్యూరాలజిస్టును నియమించారు. ఆయన ఇక్కడ ఉండలేక సెలవు మీద వెళ్లిపోయారు. ఆ తరువాత ఆయన బదిలీ చేయించుకున్నట్లు తెలిసింది. ఆ తరువాత మరో న్యూరాలజిస్టును ప్రభుత్వం ఇక్కడ వేయలేదు. అలాగే గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు, డయాబెటాలజిస్టులు సైతం ఇక్కడ లేరు.

ఒక్క కార్డియాలజిస్టుతోనే సరి...

పెద్దాసుపత్రిలో ఒక కార్డియాలజిస్టు మాత్రమే ఉన్నారు. ఆయన జిల్లా స్టెమీ నోడల్‌ ఆఫీసర్‌గా కూడా చేస్తున్నారు. ఒక్కరే కార్డియాలజిస్టు ఉండడంతో పనిభారంతో అల్లాడిపోతున్నారు. ప్రతి రోజు కనీసం 50 మంది రోగులు గుండె సమస్యలతో ఆస్పత్రికి వస్తుంటారు. వారిలో రోజుకు 4 నుంచి 5 మంది ఆస్పత్రిలో అడ్మిట్‌ అవుతున్నారు. ఇటీవల ఆయన వ్యక్తిగత పనుల మీద వారం రోజులు సెలవు మీద వెళితే రోగులను గుంటూరు రెఫర్‌ చేశారు. సాధారణ కేసులైతే పర్వాలేదు. అత్యవసర కేసుల విషయంలో మాత్రం రోగులు ఎక్కడకు వెళ్లాలి. అనివార్యంగా ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు తీయాల్సి వస్తోందని వాపోతున్నారు.

ట్రామా విభాగం ఎక్కడ ?

ప్రభుత్వాస్పత్రిలో ట్రామా కేర్‌ విభాగం ఎక్కడుందో వెతుక్కోవాల్సి వస్తోంది. ఒంగోలు దక్షిణ, ఉత్తర బైపాస్‌ ల మీద తరచుగా ప్రమాదాలు జరుగుతుంటాయి. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కారు యాక్సిడెంట్లు నిత్యం జరుగుతుంటాయి. రోడ్డు ప్రమాదం జరిగిన వాళ్లను జీజీహెచ్‌కు తరలిస్తుంటారు. ఇక్కడ ప్రత్యేక ట్రామా విభాగం లేదు. నిజానికి ట్రామా విభాగంలో ఆరుగురు వైద్యులు, స్టాఫ్‌ నర్సులు 12 మంది, ఎంఎన్‌ఓలు 6, ఎఫ్‌ఎన్‌ఓలు 6, ఎల్‌టీ 3, రేడియాలజిస్టు 2, బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌ ఒకరు ఉండాలి. ఈ సిబ్బంది ఎక్కడా కనిపించరు. ట్రామా కేర్‌ రోస్టర్‌ ఏమిటో తెలియదు. ట్రామా కేర్‌ కు ఏడాదికి ఎంత బడ్జెట్‌ వస్తుందో, అది ఏమైపోతుందో దేవుడికే తెలియాలి. యాక్సిడెంట్‌ కేసులను కూడా క్యాజువాలిటీ వైద్యంతోనే సరిపెడుతున్నారు. దాంతో రోగుల ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయి. క్యాజువాలిటీలో సీనియర్‌ వైద్యులు ఒక్కరు కూడా సరిగా విధులు నిర్వహించడంలేదని విమర్శలు వస్తున్నాయి. మెడికోలు, జూనియర్‌ వైద్యులతోనే పనికానిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ అందుతున్న వైద్య సేవలపై సాక్షాత్తు కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా హెచ్చరికలు జారీ చేసినా ఖాతరు చేయడం లేదనే చెప్పాలి.

స్పెషలిస్టు వైద్యం అందని ద్రాక్షే న్యూరాలజిస్టు, గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు, డయాబెటాలజిస్టులు లేరు న్యూరాలజిస్టు లేకుండానే సదరం సర్టిఫికెట్లు మంజూరు ఒక్క కార్డియాలజిస్టుతోనే సర్దుకొనిపోతున్న వైనం కనిపించని ట్రామా కేర్‌ విభాగం ఏదైనా సమస్య వస్తే గుంటూరుకు రెఫర్‌ స్పెషలిస్టు వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రులే దిక్కు

ఐసీయూలో..1
1/1

ఐసీయూలో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement