రైతు కడుపు మండి.. | - | Sakshi
Sakshi News home page

రైతు కడుపు మండి..

Jun 27 2025 4:49 AM | Updated on Jun 27 2025 4:49 AM

రైతు

రైతు కడుపు మండి..

మద్దిపాడు/కొండపి:

తేడాది వరకూ పొగాకు రైతుకు స్వర్ణయుగం. నాలుగేళ్లుగా లాభాలు చవిచూశారు. బోర్డు నిర్దేశించిన దాని కంటే అదనంగా సాగు చేసినా మంచి ధరలే వచ్చాయి. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం రైతుల పక్షాన నిలిచి మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించి వ్యాపారుల ఆధిపత్యానికి గండికొట్టింది. ఇక తప్పకపోవడంతో పోటీలు పడి మరీ పొగాకు కొనుగోలు చేశారు. గతేడాది పొగాకు చరిత్రలో రికార్డు ధర కేజీకి రూ.366 పలికింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2019 ముందు చరిత్ర పునావృతమైంది. కంపెనీలు రైతులను దగా చేయడం మొదలెట్టేశాయి. సాగు సమయంలో మీరు ఎంతైనా చేయండి అంటూ నమ్మబలికి కొనుగోలు సమయానికి అసలు స్వరూపాన్ని చూపించాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టించుకోవాల్సిన ప్రభుత్వం ఆర్భాట ప్రకటనలకే పరిమితమవుతోంది. మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేస్తున్నామంటూ మాయమాటలు చెబుతోంది. గురువారం వెల్లంపల్లి, కొండపి మండలాల్లో రైతుల నిరసనలు వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. వేలాన్ని బహిష్కరించి రైతులు రోడ్డెక్కారు. వెల్లంపల్లి వేలం కేంద్రం పరిధిలోని రైతులు జాతీయ రహదారిపై మద్దిపాడు వద్ద రాస్తారోకో నిర్వహించగా, కొండపి వేలం కేంద్రం పరిధిలోని రైతులు కొండపి–టంగుటూరు రహదారిపై ఆందోళనకు దిగారు. ఆ వివరాలిలా ఉన్నాయి...

మద్దిపాడు మండలంలోని వెల్లంపల్లి పొగాకు వేలం కేంద్రానికి ముండ్లమూరు క్లస్టర్‌ రైతులు గురువారం బేళ్లను తీసుకొచ్చారు. ధర పూర్తిగా తగ్గించి కొనుగోలు చేయడంతో పాటు ఎక్కువ శాతం నోబిడ్‌ కావడంతో రైతులు తీవ్ర స్థాయిలో అసంతృప్తికి గురయ్యారు. కంపెనీలన్నీ కుమ్మకై ్క ధరలు పూర్తిగా దిగ్గోయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కిలోకి రూ.220 ఇస్తామని చెప్పిన కంపెనీలు.. రూ.180కి తగ్గించడం, ఆ తర్వాత రూ.160కి కొనుగోలు చేస్తామని చెప్పడం, చివరకు రూ.125కి కొనుగోలు చేయడంతో రైతులు వేలాన్ని బహిష్కరించారు. జాతీయ రహదారిపైకి చేరుకుని రాస్తారోకో చేశారు. పొగాకు తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. జాతీయ రహదారిపై రెండువైపులా ట్రాఫిక్‌ భారీగా స్తంభించడంతో మద్దిపాడు పోలీసులు చేరుకుని రైతులను పక్కకు తరలించేందుకు ప్రయత్నించారు. తమకు న్యాయం జరిగేంత వరకూ జాతీయ రహదారిపైనే ఉంటామని రైతులు స్పష్టం చేయడంతో బోర్డు అధికారులతో పోలీసులు మాట్లాడారు. న్యాయం జరిగేలా చూస్తామని చెప్పడంతో ధర్నా విరమించి వేలం కేంద్రానికి చేరుకున్నారు. ఆర్‌ఎం లక్ష్మణరావుతో పొగాకు రైతు సంఘ నాయకులు అబ్బూరి శేషగిరిరావు, రామసుబ్బారెడ్డి, పల్లకి సత్యన్నారాయణరెడ్డి, పొగాకు రైతులు మాట్లాడారు. కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి తిరిగి వేలాన్ని ప్రారంభించారు. కానీ, కంపెనీల తీరు మారకపోవడం, ఐదు బేళ్లకుగానూ ఒకటి కొనుగోలు చేస్తూ మిగిలినవి నోబిడ్‌ చేస్తుండడంతో రైతులు మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. వేలాన్ని నిలిపివేయాలని గట్టిగా కేకలు వేయడంతో కంపెనీల బయ్యర్లు పక్కకు వెళ్లిపోయారు. కంపెనీలకు బోర్డు అధికారులు మద్దతుగా నిలుస్తున్నారంటూ రైతులు వాగ్వాదానికి దిగారు. ఈరోజు కొనని కంపెనీలు రేపైనా కొంటాయా అంటూ ఆర్‌ఎం మాట్లాడడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతులతో మాట్లాడిన ఆర్‌ఎం, వేలం సూపరింటెండెంట్‌ సత్య శ్రీనివాస్‌లు వేలాన్ని నిలిపివేసి శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

లో గ్రేడ్‌ పొగాకు కొనుగోలు చేయలేదని...

కొండపి పొగాకు వేలం కేంద్రానికి క్లస్టర్‌ పరిధిలోని జువ్విగుంట, అయ్యవారిపాలెం, తంగెళ్ల, జాళ్లపాలెం, పీరాపురం గ్రామాల రైతులు గురువారం వేలానికి పొగాకు బేళ్లు తీసుకొచ్చారు. ఆరు రౌండ్లు వేలానికి బ్రైట్‌ రకం పొగాకు బేళ్లను తీసుకొచ్చిన రైతులు.. అవి అయిపోవడంతో ఏడో రౌండ్లో లో గ్రేడ్‌ పొగాకు తీసుకొచ్చారు. లో గ్రేడ్‌ పొగాకును కనిష్ట ధర కేజీ రూ.160కి కూడా కొనుగోలు చేయకపోగా, బేళ్లను వ్యాపారులు తిరస్కరించడంతో వేలాన్ని బహిష్కరించి రైతులు ఆందోళనకు దిగారు. లో గ్రేడ్‌ పొగాకు బేళ్లను కూడా కొనుగోలు చేయాలంటూ వేలం కేంద్రం ఎదురుగా కొండపి–టంగుటూరు రహదారిపై బైఠాయించారు. ఇరువైపులా కిలోమీటర్‌ మేరకు వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు చేరుకున్నారు. ధర్నా విరమించాలని రైతులను కోరగా ససేమేరా అన్నారు. వేలం నిర్వహణ అధికారి జి.సునీల్‌ కుమార్‌, సిబ్బంది కలిసి రైతులతో చర్చల జరిపి లో గ్రేడ్‌ పొగాకు కూడా కొనుగోలు చేసే విధంగా బయ్యర్లతో మాట్లాడతానని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ వ్యాపారులు సిండికేటై ధరలు దిగ్గోస్తున్నారని ఆరోపించారు. సాగుచేసిన పొగాకులో 40 శాతం వరకు బ్రైట్‌ గ్రేడ్‌ పొగాకు పండిందని, ఇప్పటివరకు దానినే వేలానికి తీసుకొచ్చామని తెలిపారు. ఏడో రౌండ్‌ వేలానికి తమ వద్ద ఉన్న లో గ్రేడ్‌ పొగాకు తీసుకొచ్చామని, కానీ, కేజీ కనిష్ట ధర రూ.160 కూడా ఇవ్వకుండా వ్యాపారులు సిండికేట్‌గా మారి కొనుగోలు చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే గిట్టుబాటు ధర లేక అప్పుల్లో కూరుకుపోయామని ఆవేదన చెందారు. ఏడో రౌండ్‌లో అయినా గిట్టుబాటు ధర లభిస్తుందని ఆశిస్తే.. వచ్చిన బేళ్లను వ్యాపారులు తిరస్కరిస్తున్నారని వాపోయారు. గత ప్రభుత్వం ధరలు తగ్గినప్పుడు ప్రభుత్వ రంగ సంస్థ మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించి రైతులను ఆదుకుందని, ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి రైతుల బాధలు పట్టడం లేదని విమర్శించారు.

ధరలు తగ్గించేస్తూ నిలువు దోపిడీ

ఈ సీజన్‌లో కనిష్ట ధర రూ.125

ఇలా అయితే ఆత్మహత్యలే గతి

వెల్లంపల్లి, కొండపి కేంద్రాల్లో వేలం బహిష్కరించి రాస్తారోకోలు

మద్దిపాడులోని జాతీయ రహదారిపై పొగాకు దహనం

కొండపి–టంగుటూరు రహదారిపై ఆందోళన

బోర్డు అధికారులు, కంపెనీల తీరుపై నిరసన

రెండు చోట్లా భారీగా నిలిచిపోయిన వాహనాలు

ఆత్మహత్యలు చూడాల్సి వస్తుంది...

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రంగంలోకి దిగి ప్రభుత్వ రంగ సంస్థలతో పొగాకు కొనుగోలు చేయించి రైతులను ఆదుకోవాలని, లేకుంటే ఆత్మహత్యలు చూడాల్సి వస్తుందని పలువురు రైతులు హెచ్చరించారు. పచ్చాకు కూలీలకు, డ్రైవర్లకు నగదు ఇవ్వలేదని, వారు తమ ఇంటి చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు. ఏడో రౌండ్‌ వరకు వేచి చూడాలని వారిని బతిమిలాడుకున్నామన్నారు. ఏడో రౌండ్‌లో కూడా గిట్టుబాటు ధర లభించకపోవడంతో కూలీలకు, డ్రైవర్లకు ఏం సమాధానం చెప్పుకోవాలో అర్థం కావడం లేదన్నారు. లేబర్‌ యాక్ట్‌ కింద కేసులు పెడతామని వారు బెదిరిస్తున్నారన్నారు. పాలకులు ఇలాంటి దారుణ పరిస్థితులు తమకు కలిపిస్తున్నాయని వాపోయారు. ఇప్పటికై నా వారు పొగాకు రైతులను ఆదుకోవాలని రైతులు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రైతు కూలీ సంఘ జిల్లా నాయకులు గుల్లపల్లి వెంకట్రావు, రమణారెడ్డి, వెంకటరెడ్డి, రైతులు పాల్గొన్నారు.

రైతు కడుపు మండి..1
1/1

రైతు కడుపు మండి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement