ఒంగోలు టౌన్:
డ్రగ్స్ రహితంగా ప్రకాశం జిల్లాను తీర్చిదిద్దుకునేందుకు ప్రతిఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలోని పరేడ్ గ్రౌండ్ నుంచి అద్దంకి బస్టాండు సెంటర్ వరకు భ్యారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 8 వేలమందికిపైగా విద్యార్థులు, యువకులు, వివిధ శాఖల ఉద్యోగులు హాజరయ్యారు. పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన వివిధ కార్యక్రమాలలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రసంగిస్తూ దేశానికి సంపద వంటి యువత డ్రగ్స్కు బానిసలుగా మారకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. ప్రజలంతా కలిసికట్టుగా మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు ప్రతిన పూనాలన్నారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ భవిష్యత్తును ఉజ్వలంగా మార్చుకోవాలని విద్యార్థులు, యువకులకు సూచించారు. ఇందుకు తల్లిదండ్రులు, స్వచ్ఛంద సంస్థలు సహకరించాలని చెప్పారు.
ఎస్పీ ఏఆర్ దామోదర్ ప్రసంగిస్తూ సరదాగా మత్తుపదార్థాలు వాడి ఆ తర్వాత వాటికి అలవాటైపోతున్న వారు ఎక్కువగా ఉన్నారని తెలిపారు. ఒకసారి డ్రగ్స్ వినియోగానికి అలవాటు పడితే జీవితం నాశనం అవుతుందని, చివరికి జైలుకు వెళ్లడం, ఉద్యోగావకాశాలు కోల్పోవడం దాకా పరిస్థితులు తీసుకెళ్తాయని చెప్పారు. పాస్ పోర్ట్లు, వీసాల వంటివి రావని, సమాజంలో గౌరవం కోల్పోతారని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రగ్స్ వాడకూడదని సూచించారు. రానున్న రోజుల్లో ప్రతి పాఠశాల, కళాశాలల్లో కమిటీలు ఏర్పాటు చేసి విద్యార్థులకు డ్రగ్స్ వలన కలిగే దుష్ఫలితాలు వివరించేలా పెద్ద ఎత్తును అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. అలాగే మాదక ద్రవ్యాలకు అలవాటుపడిన వారిని డీ అడిక్షన్ సెంటర్లో చేర్పించడం జరుగుతుందన్నారు. మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తామని చెప్పారు. డ్రగ్స్ నియంత్రణ, గంజాయిని అరికట్టేందుకు ప్రభుత్వం ఐజీ నేతృత్వంలో ప్రతి జిల్లాలో 30 మందితో ఈగిల్ అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసిందన్నారు. ఇప్పటి వరకు 41 కేసులు నమోదు చేసి 220 మందిని గుర్తించి జైలుకు పంపించడం జరిగిందన్నారు. మాదక ద్రవ్యాలకు అలవాటుపడిన వారి ప్రవర్తనలో మార్పు వచ్చేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. నిషేధిత మాదక ద్రవ్యాలు రవాణా చేసినా, విక్రయించినా, సేవించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రగ్స్పై ఏదైనా సమాచారం ఉంటే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1972, స్థానిక పోలీసులు, డయల్ 112, పోలీసు వాట్సాప్ నంబర్ 9121102266కు తెలియజేయాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ ఈఎస్ షేక్ ఆయేషా బేగం, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బీఎన్ విజయకుమార్, డీఎస్పీలు రాయపాటి శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణ, నాగరాజు, రమణ కుమార్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. డ్రగ్స్ వినియోగంపై కష్టనష్టాలను వివరిస్తూ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
నషా ముక్త్ భారత్ అభియాన్ అవగాహన ర్యాలీలో కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎస్పీ దామోదర్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం
డ్రగ్స్ రహిత జిల్లాగా ప్రకాశం