నంబర్‌ తొలగిస్తే పంబ రేగిద్ది! | - | Sakshi
Sakshi News home page

నంబర్‌ తొలగిస్తే పంబ రేగిద్ది!

Jul 23 2024 2:10 AM | Updated on Jul 23 2024 8:25 AM

-

ఒంగోలు టౌన్‌: ఒంగోలు నగరంలో మోటారు సైకిళ్లు, ఆటోలు, కార్ల యజమానులు ఆర్టీఓ కేటాయించిన నంబర్‌ ప్లేట్లు దుర్వినియోగం చేయడంపై ‘ఇవి ఏ ఠాణా తాలుకానో’ శీర్షికన ‘సాక్షి’లో సోమవారం వచ్చిన కథనంపై జిల్లా పోలీసు యంత్రాంగం స్పందించింది. జిల్లా వ్యాప్తంగా పట్టణాలు, గ్రామాల్లో విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించిన పోలీసులు నంబర్‌ ప్లేట్లపై ఉన్న బొమ్మలు, కామెంట్లను అక్కడికక్కడే తొలగింపజేశారు. ఒరిజినల్‌ నంబర్‌ ప్లేట్లు లేని వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ క్రమంలోనే ఒంగోలు వన్‌టౌన్‌ టౌన్‌ సీఐ షేక్‌ అలీ సాహెబ్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. 

ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ నంబర్‌ కనిపించకుండా ఎలాంటి గుర్తులు కానీ, చిహ్నాలు కానీ, ఫలానావారి తాలుకా అని రాయకూడదని సష్టం చేశారు. అలాగే మోటారు సైకిళ్ల మీద ఇద్దరికి మించి ప్రయాణం చేయరాదని, మద్యం సేవించి వాహనాలు నడిపి ఇబ్బందులు కొనితెచ్చుకోవద్దని హితవు పలికారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా వాహనాలు నిలపాలని, వ్యాపారులు తమ షాపుల ముందు రోడ్ల మీద వాహనాలు నిలపకుండా తగిన జాగ్రతలు తీసుకోవాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement