
ఒంగోలు అర్బన్: సముద్ర తీర ప్రాంతాన్ని రాష్ట్రానికి సంపదగా మారుస్తూ మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం హర్షణీయమని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి అన్నారు. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ప్రకాశం భవనం నుంచి జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావులతో కలిసి ఎంపీ పాల్గొన్నారు. కార్యక్రమంలో మత్స్యకారులకు రూ.20 లక్షల విలువ చేసే ఇన్సులేటెడ్ వాహనాలకు సంబంధించిన మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాగుంట మాట్లాడుతూ 970 కిలోమీటర్ల పొడవైన సముద్ర తీరం రాష్ట్రానికి ఉండటం ఒక వరమన్నారు. మన జిల్లాలో కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ నిర్మాణం ఎంతో మేలు చేస్తుందన్నారు. మత్స్యకార భవన నిర్మాణానికి అవసరమైన ఆర్ధిక సహాయం అందిస్తానన్నారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ బతుకుతెరువు కోసం ప్రకృతి వనరులపై ఆధారపడుతున్న మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం అన్నీ రకాలుగా అండగా ఉంటుందన్నారు.
మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు మాదిగ మాట్లాడుతూ ప్రాణాలను పణంగా పెట్టి సముద్రంలోకి వేటకు వెళ్తున్న మత్స్యకారుల జీవితాల్లో ముఖ్యమంత్రి గణనీయమైన మార్పు తీసుకొచ్చారన్నారు.
జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ మత్స్యకారుల పడవలకు లీటరుకు రూ.9 సబ్సిడీతో డీజిల్, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షల బీమా, కేసీసీ కార్డుల ద్వారా రుణాలు, ఆక్వా రైతులకు సబ్సిడీ విద్యుత్ వంటి పలు సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 2019 నుంచి ఇప్పటి వరకు రూ.397 కోట్ల మేరకు ఆర్ధిక ప్రయోజనం కలిగిందన్నారు. జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ ఆల్ల రవీంద్రా రెడ్డి మాట్లాడుతూ కొత్తపట్నంలో రూ.392 కోట్లతో ఫిషింగ్ హార్బర్ను ఏర్పాటు చేస్తుండటంతో పాటు మత్స్యకారులకు అందుబాటులో ఉండేలా సచివాలయ స్థాయిలో ఫిషరీస్ అసిస్టెంట్లను నియమించి 50 ఏళ్లు దాటిన మత్స్యకారులకు పింఛన్ వంటి సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రభుత్వం అందిస్తుందన్నారు. కార్యక్రమంలో మత్స్య కార్పొరేషన్ డైరెక్టర్ సుమతి, సంఘం నాయకులు వాయల మోహన్రావు, ఆప్కాబ్ న్యాయ సలహాదారు సైదా, మత్స్యశాఖ సహాయ సంచాలకులు ఉషాకిరణ్ పాల్గొన్నారు.
పోర్టులు, ఫిషింగ్ హార్బర్లతో తీర ప్రాంతం అభివృద్ధి పలు సంక్షేమ పథకాలతో మత్స్యకారులకు మేలు ప్రపంచ మత్స్య దినోత్సవంలో ఎంపీ మాగుంట