YSRTP టీఆర్‌ఎస్‌ ఏడేళ్ల పాలనలో బీసీలకు అన్యాయం

YSRTP Party Leaders Fires On TRS Party In Mahabubnagar - Sakshi

మహబూబ్‌ నగర్‌: తెలంగాణలో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ నాయకులు విమర్శించారు. పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన సమావేశంలో బీసీ గౌరవ సభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం పార్టీ నాయకులు రామకోటి, శ్రీరాములు, శ్రీనివాస్‌, అమృతసాగర్‌, బాలరాజ్‌ మాట్లాడుతూ.. బీసీల ఐక్యతను చాటేందుకు అక్టోబర్‌ 3వ తేదీన వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కోస్గి పట్టణంలో బీసీ గౌరవ సభను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఏడేళ్ల తెలంగాణలో బీసీల అభివృద్ధిని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు. రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న బీసీ ఓట్లతో గద్దెనెక్కిన కేసీఆర్‌ బీసీలకు పదవులు దక్కకుండా మోసం చేశారని ధ్వజమెత్తారు. బీసీ కార్పొరేషన్‌లను టీఆర్ఎస్‌ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు.

బీసీ విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వకుండా ఇ‍బ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ వసతిగృహాల్లో వసతులు లేవని, అదనపు గదుల నిర్మాణాల ఊసేలేదని విమర్శించారు. బీసీలను గొర్లు, బర్రెలు, చెప్పులకు మాత్రమే పరిమితం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పేద బీసీలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు మంజురు చేయడానికి ఆలస్యం చేస్తున్నారని తెలిపారు. కోస్గిలో నిర్వహించే బీసీ గౌరవ సభకు బీసీలతో పాటు అందరూ భారీగా తరలిరావాలని వైఎస్సార్‌టీపీ నాయకులు పిలుపునిచ్చారు.

చదవండి: ‘లంచం ఇస్తే తీసుకోండి.. కానీ’.. ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top