తాడేపల్లి : చంద్రబాబు యదేచ్చగా క్రెడిట్ చోరీ చేస్తున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ ధ్వజమెత్తారు. తమ నాయకుడు వైఎస్ జగన్ తెచ్చిన పరిశ్రమలను కూడా నిస్సిగ్గుగా చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారని మండిపడ్డారు.
ఈరోజు(గురువారం, ఏప్రిల్ 23వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన పుత్తా శివశంకర్.. జగన్ కష్టాన్ని చంద్రబాబు క్రెడిట్ చోరీ చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.
రెన్యూ సంస్థ జగన్ హయాంలోనే ఏపీలో పెట్టుబడులకు సిద్దమైంది. 2023లో వైజాగ్లో జరిగిన జీఐఎస్ సదస్సులో జగన్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది ఆ సంస్థ. జగన్ ప్రభుత్వమే ఆ రెన్యూ సంస్థకు భూములను కూడా కేటాయించింది. అయితే చంద్రబాబు అప్పటి జీవోలను రద్దు చేసి మళ్లీ అదే పేరుతో కొత్తగా ఇచ్చారు. అంటే తానే రెన్యూ సంస్థను తెచ్చినట్లు బిల్టప్ ఇస్తున్నారు.
రెన్యూ సంస్థ ఛైర్మన్ సుమన్ సిన్హా సైతం జీఐఎస్ సదస్సులో జగన్ పాలనను మెచ్చుకున్నారు. జగన్ కల్పించిన అవకాశాల వలనే తాము ఏపీలో పెట్టుబడులు పెడుతున్నట్టు కూడా ప్రకటించారు. మీడియా ముందు ప్రకటించటంతో పాటు ట్వీట్ కూడా చేశారు. కానీ జనానికి ఇవేమీ తెలియదని చంద్రబాబు అనుకుంటున్నారు. జగన్ కష్టాన్ని చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారు. రాష్ట్రంలో క్రెడిట్ చోరీ, జగన్ని దూషించటం తప్ప మరేమీ జరగటం లేదు’ అని మండిపడ్డారు.


